Telugu Global
Andhra Pradesh

జేఏసీ అంటే జగన్ యాక్షన్ కమిటీ.. టీడీపీ సెటైర్లు

జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ కాదని, జగన్ యాక్షన్ కమిటీ అని అంటున్నారు టీడీపీ నేతలు. కొంతమంది పెద్దల్ని బెదిరించి మరీ జేఏసీలోకి తెచ్చారని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.

జేఏసీ అంటే జగన్ యాక్షన్ కమిటీ.. టీడీపీ సెటైర్లు
X

అమరావతి యాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించక ముందే.. అక్కడ వాతావరణం వేడిగా మారింది. ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ రాజీనామాల విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది.

జేఏసీ ఎందుకు..?

అమరావతి రైతు జేఏసీకి పోటీగా అభివృద్ధి వికేంద్రీకరణ జేఏసీని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర మేధావులతో ఏర్పాటైన ఈ జేఏసీకి వైసీపీ సపోర్ట్ ఉంది. వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. అయితే జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ కాదని, జగన్ యాక్షన్ కమిటీ అని అంటున్నారు టీడీపీ నేతలు. కొంతమంది పెద్దల్ని బెదిరించి మరీ జేఏసీలోకి తెచ్చారని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.

అప్పుడెందుకు చేయలేదు..

విశాఖ రాజధానిగా లేకపోతే రాజీనామా చేస్తామంటూ ముందుకొస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తున్నప్పుడు ఏమైపోయారంటూ నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. విశాఖ రైల్వేజోన్ కోసం ఏనాడైనా రాజీనామా చేస్తామని ప్రకటించారా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు లేని రాజీనామాలు, ఇప్పుడెందుకంటూ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజీనామా డ్రామాలాడే నేతలంతా తోలుబొమ్మలేనని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. 2014లో జగన్ పై కేసులున్నాయని, ఆయన సూట్ కేసు కంపెనీలు పెట్టారని ఆరోపించిన నేతలే ఇప్పుడు జగన్ పంచన చేరారని, అవకాశం వస్తే వారు మరోసారి ప్లేటు ఫిరాయిస్తారని టీడీపీ నేతలంటున్నారు. ఎన్నికల సమయంలో అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పినవారంతా ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు.

First Published:  9 Oct 2022 9:30 AM GMT
Next Story