Telugu Global
Andhra Pradesh

ముడుపులు నిజమనేందుకు ఇదే సాక్ష్యం

రూ.118 కోట్లు ముడుపుల వ్య‌వ‌హారంలో చంద్రబాబు ఇచ్చిన‌ వివరణ సరిగా లేదు కాబట్టి ఈ మొత్తాన్ని బ్లాక్ మనీగానే పరిగణిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంగా షోకాజ్ నోటీసులో చెప్పారు.

ముడుపులు నిజమనేందుకు ఇదే సాక్ష్యం
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు అమరావతి రాజధాని నిర్మాణం పనుల్లో రూ.118 కోట్లు ముడుపులు అందాయన్నది ఐటీ శాఖ ఆభియోగాలు. ఈ 118 కోట్ల రూపాయల విషయంలో చంద్రబాబు వివరణ సరిగా లేదు కాబట్టి ఈ మొత్తాన్ని బ్లాక్ మనీగానే పరిగణిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంగా షోకాజ్ నోటీసులో చెప్పారు. బ్లాక్ మనీయా లేకపోతే ముడుపులా అన్నది పక్కనపెట్టేస్తే ఒకటి మాత్రం నిజం. అందేమిటంటే చంద్రబాబుకు రూ.118 కోట్లు ముట్టాయన్నది నిజమే అని జనాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

మొదటి నుండి అమరావతి అన్నది పెద్ద కుంభకోణమని జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెబుతున్నదే. ఇందులో కూడా జనాలకు కూడా చాలా అనుమానాలున్నాయి. తాజాగా ఆ అనుమానాలకు ఐటీ శాఖ సమాధానమిచ్చిందంతే. అయితే రూ.118 కోట్లు చంద్రబాబుకు అందాయి అనేందుకు మరో సాక్ష్యం కూడా ఉంది. అదేమిటంటే ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ నేతల వైఖరే. చంద్రబాబుకు ఇబ్బందులు వస్తాయని అనుకున్నపుడల్లా ఎల్లో మీడియా, తమ్ముళ్ళు అసలా విషయాన్ని ప్రస్తావించరు.

ఇప్పుడు ఐటీ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసును ఎల్లో మీడియా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎల్లో మీడియా కానీ తమ్ముళ్ళు కానీ తేలుకుట్టిన దొంగల్లాగ ఉండిపోయారు. దీంతోనే ఐటీ శాఖ చెప్పినట్లుగా రూ.118 కోట్లు చంద్రబాబుకు ముట్టాయని జనాలు నమ్ముతున్నారు. ఐటీ శాఖ నోటీసుపై ఎల్లో మీడియా వార్తలు రాయలేదు, టీవీల్లో డిబేట్లు కూడా లేవు. ఇక తమ్ముళ్ళయితే రెండు రోజులుగా మీడియా సమావేశాలు కూడా పెట్టడంలేదు. ఇదంతా దేనికి నిదర్శనం అంటే చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని అనుకునేందుకే.

ఒకవేళ ఐటీ శాఖ అభియోగాలు తప్పయితే ఎల్లో మీడియా, తమ్ముళ్ళు వ్యవహారం ఇలాగ ఉండేదికాదు. ఐటీ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వంపైన ఆకాశమంత ఎత్తున రెచ్చిపోయేవారే. పేజీలకు పేజీలకు చంద్రబాబుకు మద్దతుగా స్టోరీలు, గంటలకొద్ది టీవీల్లో డిబేట్లు నడిపేవారే. ఇవేవీ జరగలేదంటే చంద్రబాబును సమస్యలోనుండి బయటపడేయటం ఎలాగ అని అందరు కలిసి ఆలోచిస్తున్నట్లే. ఇంకో విచిత్రం ఏమిటంటే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడే కారణమట. కేంద్రంలోని పెద్దలపైన జగన్ బాగా ఒత్తిడి తీసుకొచ్చి ఐటీ శాఖ ద్వారా చంద్రబాబుకు నోటీసులు ఇప్పించారని రాసుకోవటమే కొసమెరుపు.


First Published:  3 Sep 2023 5:27 AM GMT
Next Story