Telugu Global
Andhra Pradesh

బీజేపీతో పొత్తు లేనట్లేనా?

మీడియాతో చంద్రబాబు అనేక విషయాలు మాట్లాడారు. అందులో మూడు పాయింట్లు చాలా కీలకమైనవి. నిజానికి పై మూడు పాయింట్లు కూడా దేనికదే ప్రత్యేకం. కానీ మూడింటిని కలిపి చూసినపుడు బీజేపీతో పొత్తు ఉండదని చెప్పకనే చెప్పినట్లే అనిపిస్తోంది.

బీజేపీతో పొత్తు లేనట్లేనా?
X

ఢిల్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు విన్నతర్వాత చాలా మందికి ఇదే అర్థ‌మవుతోంది. మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ లో అనేక విషయాలు మాట్లాడారు. అందులో మూడు పాయింట్లు చాలా కీలకమైనవి. అవేమిటంటే మొదటిది తెలంగాణలో టీడీపీ అన్నీ స్థానాలకు పోటీ చేస్తుందని. రెండో పాయింట్ ఏమిటంటే తెలంగాణలో బీజేపీతో పొత్తుంటుందా అన్న ప్రశ్నకు అందుకు సమయం మించిపోయిందన్నారు. ఇక మూడో పాయింట్ ఏమిటంటే ప్రత్యేక హోదా డిమాండ్ మీదే గతంలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పారు.

నిజానికి పై మూడు పాయింట్లు కూడా దేనికదే ప్రత్యేకం. కానీ మూడింటిని కలిపి చూసినపుడు బీజేపీతో పొత్తు ఉండదని చెప్పకనే చెప్పినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకాలం తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమ ఓట్లన్నింటినీ బీజేపీకి వేయిస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అందుకు గాను ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవాలని అమిత్ షా తో భేటీ సందర్భంగా చంద్రబాబు కండీషన్ పెట్టారని ప్రచారంలో ఉంది.

తాజాగా అన్నీ స్థానాల్లోను టీడీపీ పోటీ చేయబోతోందని ప్రకటించారంటే అర్థ‌మేంటి? ఎవరితోను పొత్తు లేదనే కదా. అంటే బీజేపీతో కూడా పొత్తుండదని చెప్పేసినట్లే. ఇక బీజేపీతో పొత్తు గురించి అడిగితే దానికి సమయం మించిపోయిందన్నారు. నిజానికి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటానికి సమయం ఏమీ మించిపోలేదు. ఎందుకంటే రెండు పార్టీలకు తెలంగాణాలో అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు లేరు. పైగా రెండు పార్టీలూ ఎక్కడ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. అలాంటపుడు సమయం మించిపోయేదేముంది? బహుశా బీజేపీ జాతీయ అధ్యక్షుడే నడ్డాయే పొత్తు కుదరదని చెప్పుంటారు.

ఇక మూడో పాయింట్ ఏమిటంటే ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయేలో నుండి వచ్చేసినట్లు చెప్పారు. ఇది పైకి చెప్పుకునే కారణం మాత్రమే. నిజానికి ప్రత్యేక హోదాను నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టేసిందే చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజీ కోసమే ప్రత్యేక హోదాను వదులుకున్నట్లు ఇదే చంద్రబాబు చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. ఇక హోదా డిమాండ్‌తో ఎన్డీయేలో నుండి వచ్చేసినట్లు చెప్పటం అబద్ధంకాక మరేమిటి ? 2019 ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేసి 2018లో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చారు. సో మూడు పాయింట్లను చూస్తే ఏపీలో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తుండదనే అర్థ‌మవుతోంది.


First Published:  30 Aug 2023 5:14 AM GMT
Next Story