Telugu Global
Andhra Pradesh

జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యమేనా..?

అసలు ఏపీలో బీజేపీకి ఏముందని వైసీపీలోని 70 మంది ఎంఎల్ఏలు ఆపార్టీలో చేరుతారు..? ఇప్పుడు ప్రలోభాలకు లొంగిపోయి బీజేపీలో చేరినా వచ్చే ఎన్నికల్లో గెలవగలరా..? పార్టీమారిన ఎంఎల్ఏలపై అనర్హత వేటుకు వైసీపీ స్పీకర్ కు నోటీసిస్తుంది.

జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యమేనా..?
X

రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే విషయంలో నాలుగు రాష్ట్రాలు బీజేపీ హిట్ లిస్టులో ఉన్నట్లు కేసీఆర్ బయటపెట్టారు. ఆ లిస్టులో ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, ఏపీకూడా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో ఎంఎల్ఏలను కొనటానికి బేరాలాడిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు ఈ విషయాన్ని తమ ఎంఎల్ఏలతో స్పష్టంగా చెప్పినట్లు కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ సీఎం చెప్పింది ఏపీ విషయంలో లాజికల్ గా సాధ్యంకాకపోయినా ప్రయత్నాలు చేసే అవకాశాలను కొట్టేసేందుకు లేదు.

ఇక టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే ఏపీలో వైసీపీ ఎంఎల్ఏలను లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశాలు నూరుశాతం లేవు. ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీలో ఒక్క ఎంఎల్ఏ కూడా లేరు. అలాగే వైసీపీ ఎంఎల్ఏలను లాగేసుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే కనీసం 70 మంది ఎంఎల్ఏలను లాగేసుకోవాలి. ఎందుకంటే 175 మంది ఎంఎల్ఏల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా కనీసం 88 మంది ఎంఎల్ఏలుండాలి. 70 మంది ఎఎల్ఏలను లాగేస్తే కానీ జగన్ ప్రభుత్వం కూలిపోదు. జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టినా బీజేపీ అయితే అధికారంలోకి రాదు.

అసలు ఏపీలో బీజేపీకి ఏముందని వైసీపీలోని 70 మంది ఎంఎల్ఏలు ఆపార్టీలో చేరుతారు..? ఇప్పుడు ప్రలోభాలకు లొంగిపోయి బీజేపీలో చేరినా వచ్చే ఎన్నికల్లో గెలవగలరా..? పార్టీమారిన ఎంఎల్ఏలపై అనర్హత వేటుకు వైసీపీ స్పీకర్ కు నోటీసిస్తుంది. వెంటనే వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే సభ్యత్వాలు రద్దవుతాయి. అప్పుడందరు మాజీలవుతారు. దీనివల్ల పార్టీ మారిన ఎంఎల్ఏలకు ఒరిగేదేముంటుంది..?

ఇక ఏదో కేసులో జగన్ను అరెస్టుచేసి జైలుకు పంపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందనే అనుకుందాం. అదే జరిగితే జగన్ బదులుగా వైఎస్ భారతో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో కుర్చీలో కూర్చుంటారు కానీ ప్రభుత్వం అయితే పడిపోదుకదా..? ఏదోరూపంలో ప్రభుత్వాన్ని పడగొడితే అప్పుడు జగన్ కలనిజమవుతుంది. అదేమిటంటే 175కి 175 సీట్లూ వైసీపీ గెలవాలని జగన్ పదేపదే చెబుతున్నారు. జగన్ను జైలుకు పంపినా, ప్రభుత్వాన్ని కూల్చేసినా వైసీపీ 175 సీట్లు గెలవటం ఖాయమేమో. అయినా ఇవన్నీ బీజేపీ పెద్దలకు తెలీకుండానే ఉంటుందా..? ఏ కోణంలో చూసినా వైసీపీ ఎంఎల్ఏలను కొనటం వల్ల బీజేపీకి నష్టమే కానీ లాభమైతే లేదు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

First Published:  4 Nov 2022 5:54 AM GMT
Next Story