Telugu Global
Andhra Pradesh

ఉత్తరాంధ్రకు మంచికాలం వస్తోందా..?

చాలాకాలంగా పెండింగులో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ సమస్యలు కూడా క్లియర్ అయిపోయాయి.

ఉత్తరాంధ్రకు మంచికాలం వస్తోందా..?
X

ఒకప్రాంతం అభివృద్ధికి ఒకేసారి మూడు భారీప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయంటే అర్థ‌మేంటి..? ఆ ప్రాంతానికి మంచిరోజులు వచ్చాయనే కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి జనాలు ఇలాగే ఆలోచిస్తున్నారు. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అడ్డంకులన్నీ ఒకేసారి క్లియర్ అయిపోవటంతో ప్రభుత్వం కూడా హ్యాపీగా ఫీలవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే విజయనగరంలో భోగాపురం ఎయిర్ పోర్టు కేసులన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టేసింది. భూసేకరణకు లైన్ క్లియర్ చేసింది.

అలాగే చాలాకాలంగా పెండింగులో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ సమస్యలు కూడా క్లియర్ అయిపోయాయి. ఇక ఎనిమిదిన్నరేళ్ళుగా నానుతున్న దక్షిణకోస్తా రైల్వేజోన్ ఆఫీసు భవనం నిర్మాణం శంకుస్ధాపనకు స్వయంగా నరేంద్రమోడీనే వస్తున్నారు. కొద్దిసంవత్సరాల్లోనే ఉత్తరాంధ్ర అభివృద్దిపథంలో దూసుకుపోవటం ఖాయమనటానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏమికావాలి.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే జిల్లా రూపురేఖలే మారిపోతాయి. ఏడాదికి సుమారు 60 లక్షలమంది ప్రయాణీకులు ఈ ఎయిర్ పోర్టునుండి రాకపోకలు సాగిస్తార‌ని ప్రాజెక్టు రిపోర్టు చెబుతోంది. అంటే అంతరద్దీని తట్టుకోవాలంటే ఎంతపెద్ద ఎయిర్ పోర్టు నిర్మాణం జరగాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎయిర్ పోర్టుకు అనుబంధంగా చిన్నా, పెద్ద హోటళ్ళు నిర్మిస్తారు. ఇలా అనేకరకాలుగా అభివృద్ధి జరుగుతుంది. భావనపాడు సీ పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇలాంటి అభివృద్ధే జరుగుతుంది.

ఇక దక్షిణకోస్త రైల్వేజోన్ ఏర్పాటువల్ల విశాఖ అభివృద్ధి పరుగులు పెడుతుందనటంలో సందేహంలేదు. అంటే భోగాపురం ఎయిర్ పోర్టు రూపంలో విజయనగరం, భావనపాడు సీ పోర్టు కారణంగా శ్రీకాకుళం, రైల్వేజోన్ ఏర్పాటు వల్ల విశాఖ జిల్లాలో ఊహించని అభివృద్ది జరుగుతుంది. ఇవన్నీ సరిపోవన్నట్లు విశాఖకు ఏకంగా రాజధానే వచ్చే అవకాశాలున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్రకు ఇంకేమి కావాలి ?

First Published:  5 Nov 2022 6:07 AM GMT
Next Story