Telugu Global
Andhra Pradesh

ఆగస్టులోనే కాపురం మార్చేస్తున్నారా..?

రుషికొండ ప్రాంతంలోని ఒక భవనంలోకి సీఎంవోను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే భవనం పనులు చాలా వేగంతో జరుగుతున్నాయట. విశాఖలో మూడురోజులు మిగిలిన మూడురోజులు తాడేపల్లిలో ఉండబోతున్నారు.

ఆగస్టులోనే కాపురం మార్చేస్తున్నారా..?
X

రాబోయే సెప్టెంబర్ మాసం నుంచి వైజాగ్ లోనే కాపురం ఉండబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్‌లో కాకుండా ఒక నెలరోజులు అంటే ఆగస్టులోనే కాపురాన్ని విశాఖకు మార్చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. మొన్నటి మూడురోజుల ఢిల్లీ పర్యటన తర్వాత తాడేపల్లి నుంచి విశాఖపట్నంకు వెళ్ళే ముహూర్తాన్ని నెలరోజులు ముందుకు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల విషయమై సుప్రిం కోర్టులో విచారణ జరుగుతోంది.

జూలై 28వ తేదీన విచారణ జరగబోతోంది. విచారణలో ఏమవుతుందో తెలీదు. కేసు ఫైనల్ అయ్యేటప్పటికి ఎంతకాలం పడుతుందో చెప్పలేరు. అందుకని అంతకాలం వెయిట్ చేయటం కష్టం కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఈలోగానే మార్చేయాలని జగన్ అనుకున్నారు. రాజధాని అంటే కష్టంకానీ తన కార్యాలయాన్ని మార్చుకోవాలంటే.. ఎవరి అనుమతి అవసరంలేదు. జూలైలో జరగబోయే విచారణలో కూడా ప్రభుత్వానికి ఊరటదక్కుతుందని అనుకోవటంలేదు. అందుకనే ఆగస్టులోనే ముందు తాను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారట.

రుషికొండ ప్రాంతంలోని ఒక భవనంలోకి సీఎంవోను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే భవనం పనులు చాలా వేగంతో జరుగుతున్నాయట. విశాఖలో మూడురోజులు మిగిలిన మూడురోజులు తాడేపల్లిలో ఉండబోతున్నారు. మూడురోజుల ఢిల్లీ పర్యటనలో ఏదో సడెన్ డెవలప్మెంట్ జరిగిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాతే ఆగస్టులోనే విశాఖకు మారబోయే విషయాన్ని జగన్ చెప్పారట. విశాఖకు మారే విషయం సడెన్ గా నెలరోజుల ముందుకు ఎందుకు జరిగిందని ఎవరికీ తెలీటంలేదు.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే.. టీడీపీ, జనసేన రెండూ ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో ఇప్పుడు వైసీపీకి 28 మంది ఎంఎల్ఏలున్నారు. ఇదే మార్క్ విజయం రిపీటవుతుందో లేదో తెలీదు. ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలవాలని చంద్రబాబు నాయుడు, పవన్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. పొత్తు పెట్టుకోవాలని అనుకోవటం కూడా ఇందులో భాగమే. కాబట్టి తాను కూడా విశాఖలో మకాంవేస్తేనే మళ్ళీ మెజారిటీ సీట్లు గెలుచుకోవటం సాధ్యమవుతుందని జగన్ అనుకున్నట్లున్నారు. అందుకనే డైరెక్టుగా వైజాగ్ లోనే క్యాంపువేయాలని డిసైడ్ అయ్యారు.

First Published:  31 May 2023 5:05 AM GMT
Next Story