Telugu Global
Andhra Pradesh

ఐ ప్యాక్ టీమ్ కు ఎరవేశారా..?

అలాంటి రాబిన్ తో ఇప్పుడు పీకే బృందం నుండి శాంతను వెళిపోయి చేతులు కలిపారు. ఇక్కడే అందరికీ శాంతను నిష్క్రమణ వెనుక అనుమానాలు పెరిగిపోయాయి.

ఐ ప్యాక్ టీమ్ కు ఎరవేశారా..?
X

క్షేత్రస్ధాయిలో జరిగింది చేస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్ధ ఐప్యాక్ లో కీలకమైన వ్యక్తిగా ఉన్న శాంతను సింగ్ హఠాత్తుగా రాబిన్ శర్మ బృందంలో చేరిపోయారు. నిజానికి వైసీపీకి పనిచేస్తున్న పీకే బృందానికి, టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ బృందానికి మధ్య వృత్తిపరమైన వైరముంది. మామూలుగా అయితే రెండు బృందాల్లోని సభ్యులు ఒకరితో మరొక‌రు కలవరు, ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు.

కానీ, ఇంతకాలం వైసీపీకి పనిచేస్తున్న శాంతను సడెన్ గా రాబిన్ బృందంలో చేరారంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు రాబిన్ కూడా పీకే ఐప్యాక్ బృందంలో పనిచేసిన వ్యక్తే. పీకే నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టుకుని పోటీగా మరో రాజకీయ వ్యూహకర్త అవతారమెత్తారు. అలాంటి రాబిన్ తో ఇప్పుడు పీకే బృందం నుండి శాంతను వెళిపోయి చేతులు కలిపారు. ఇక్కడే అందరికీ శాంతను నిష్క్రమణ వెనుక అనుమానాలు పెరిగిపోయాయి.

విషయం ఏమిటంటే.. టీడీపీకి పనిచేస్తున్న రాబిన్ ఒకరకంగా ఫెయిలయ్యారనే చెప్పాలి. రాబిన్ ఇస్తున్న వ్యూహాలు టీడీపీ పునరుత్తేజానికి పెద్దగా పనిచేస్తున్నట్లు లేదు. మూడున్నరేళ్ళల్లో టీడీపీ బలోపేతమైందని చెప్పుకునేందుకు ఒక ఉదాహరణ కూడా కనబడటంలేదు. దాంతో వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయమై చంద్రబాబు నాయుడుకే నమ్మకంలేదు. ఈ పరిస్ధితుల్లో రాబిన్ వల్ల ఉపయోగం లేదని అనుకున్నట్లున్నారు. అందుకనే ఏదో మాయచేసి ఎరవేసి శాంతనును టీడీపీ వైపున‌కు లాక్కున్నట్లున్నారు. తెరవెనుక ఏమి జరిగిందనేది నాలుగురోజులు పోతే అన్నీ బయటకు వస్తాయి.

వైసీపీకి పనిచేయటంలో శాంతను హ్యాపీగానే ఉన్నారు. అయినా ఎందుకు వచ్చేసినట్లు..? ఎందుకంటే ఐప్యాక్ లో కన్నా ఎక్కువ లాభం ఉంటుందని ఆఫర్ ఇచ్చుంటారు కాబట్టే అక్కడ వదిలి రాబిన్ తో చేతులు కలిపారు. శాంతను వెళిపోతే వైసీపీకి జరగబోయే నష్టముండదు, టీడీపీకి జరగబోయే లాభమూ ఉండదు. ఒక వ్యూహకర్త బృందంలో కీలకమైన వ్యక్తి వెళిపోతే మళ్ళీ వ్యూహాలు మార్చుకుంటారంతే. పార్టీ అధినేతలో దమ్ముండాలి కానీ వ్యూహకర్తల్లో ఏముంటుంది..?

First Published:  26 Dec 2022 5:20 AM GMT
Next Story