Telugu Global
Andhra Pradesh

పారిశ్రామిక వృద్ధి ఏపీ ప్రభుత్వ లక్ష్యం - సీఎం జగన్

వచ్చే నాలుగేళ్లలో 20 వేల ఉద్యోగాలు వస్తాయని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ వరుసగా మూడోసారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిందని చెప్పారు సీఎం జగన్

పారిశ్రామిక వృద్ధి ఏపీ ప్రభుత్వ లక్ష్యం - సీఎం జగన్
X

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఆంధ్రప్రదేశ్ పెద్ద ఉదాహరణ అని అన్నారు సీఎం జగన్. పారిశ్రామిక వృద్ధికి ఏపీ ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్‌ కో సిమెంట్‌ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. రామ్‌ కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారాయన. వచ్చే నాలుగేళ్లలో 20 వేల ఉద్యోగాలు వస్తాయని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ వరుసగా మూడోసారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిందని చెప్పారు సీఎం జగన్. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమైందని, తమది ఇండస్ట్రీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారాయన.

నంద్యాల జిల్లాలో ఇప్పటికే జయజ్యోతి, జె.ఎస్.డబ్ల్యు. సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉండగా, తాజాగా కల్వటాల వద్ద రూ.1,790 కోట్లతో రామ్‌ కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమ నెలకొల్పింది. ఏడాదికి 2 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఈ పరిశ్రమను స్థాపించారు. సిమెంట్‌ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ముడి ఖనిజపు నిల్వలు కొలిమిగుండ్ల మండలంలో ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు అనువైనదిగా గుర్తించారు. రవాణా సౌకర్యం, నీటి వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉండటంతో ఇక్కడ రామ్ కో పరిశ్రమ నెలకొల్పారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొలిమిగుండ్ల, నాయినపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుంచి 5 వేల ఎకరాల భూమి సేకరించారు. 2018 డిసెంబర్‌ 14లో పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయగా ఇప్పటికి అది పూర్తయింది.

ప్రతి ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. 30 మెగా వాట్ల థర్మల్‌ ప్లాంట్‌ ను కంపెనీ సొంతంగా ఏర్పాటు చేసుకుంది. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలిచ్చారు. మరో 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

First Published:  28 Sep 2022 4:30 AM GMT
Next Story