Telugu Global
Andhra Pradesh

వైసీపీకి 175 దేవుడెరుగు..! 151లో ఎంత‌మంది ఉంటారో..?

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి `వై నాట్ 175` నినాదం మేక‌పోతు గాంభీర్య‌మేన‌ని ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 రావ‌డం సంగ‌తి అటుంచి ఉన్న 151 మందిలో ఎంత మంది ఉంటారో, ఎంత మంది జంప్ కొడ‌తారోన‌నే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

Andhra Pradesh Assembly Elections 2024
X

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి `వై నాట్ 175` నినాదం మేక‌పోతు గాంభీర్య‌మేన‌ని ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 రావ‌డం సంగ‌తి అటుంచి ఉన్న 151 మందిలో ఎంత మంది ఉంటారో, ఎంత మంది జంప్ కొడ‌తారోన‌నే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.


నెల్లూరు జిల్లా నుంచి వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డ్డారు. వీరిని వైసీపీయే పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతోంద‌ని అంటున్నారు. కానీ, వీరు ఇత‌ర పార్టీల‌తో ట‌చ్ ఉన్నార‌ని, ఎప్పుడైనా పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని, ముందుగానే ప్ర‌త్యామ్నాయం వైపు వైసీపీ దృష్టి సారించ‌డంతో అసంతృప్తవాదులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌ప‌డుతున్నార‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌కాశం జిల్లా నుంచి గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏ పార్టీలో చేర‌తారో తెలియ‌దు కానీ, వైసీపీలో ఉండ‌ర‌ని టాక్ న‌డుస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యే, వైసీపీ ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని పుకార్లు వ‌చ్చాయి. వీటిని ఆయ‌న ఖండించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ రాద‌ని చెబుతున్నారు. త‌న కొడుకుకి టికెట్ కావాలి, అలాగే బావ సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్, కానీ ఇత‌ర చోట్ల ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వ‌కూడ‌ద‌నే కండీష‌న్లు నెర‌వేర్చుకుంటారో, పుకార్లని నిజం చేస్తూ ఏదైనా పార్టీలోకి మారినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

ఇక కృష్ణా జిల్లాలో మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత‌కృష్ణ‌ప్రసాద్ ఎటు వెళ‌తారో తెలియ‌దు కానీ, వైసీపీలో ఆయ‌న ఉండేలా లేరు. వైసీపీ కూడా వ‌సంత సంత మాకొద్దు అనే సంకేతాలు పంపుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి ఆల్రెడీ వైసీపీ పొగ‌బెట్టేసింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రితని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించిన నుంచీ పార్టీకి అంటీముట్ట‌న‌ట్టు ఉంటోంది. వైసీపీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసింది. సుచ‌రిత వైసీపీలో కొన‌సాగ‌డం క‌ష్ట‌మేనని పార్టీలోనే గుస‌గుస‌లు ప్రారంభం అయ్యాయి.

వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో ఇప్ప‌టికే ర‌ఘురామ‌కృష్ణంరాజు దూరం అయ్యారనే కంటే వైసీపీ దూరం పెట్టింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఇరుక్కున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప‌క్క‌చూపులు చూస్తున్నారు. న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయలు వైసీపీలో ఉండే అవ‌కాశాలు లేవ‌ని చాలా కాలంగా రూమ‌ర్లున్నాయి. యువ ఎంపీకి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.


ఇప్ప‌టివ‌ర‌కూ వైసీపీలో అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన ఎంపీ, ఎమ్మెల్యేల లిస్టు ఈ రేంజులో ఉంటే. .లోలోప‌ల మ‌థ‌న‌ప‌డుతూ, ఎన్నిక‌ల ముందు గోడ దూకే ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంకెంత మంది ఉంటారోన‌ని వైసీపీలో గుబులు రేపుతోంది.

First Published:  31 Jan 2023 9:19 AM GMT
Next Story