Telugu Global
Andhra Pradesh

నమ్మకంతో గెలిపిస్తే.. నీలి చిత్రాలు చూపిస్తావా..?

ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఏ మొహం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేశారని మండిపడ్డారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్‌ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు బాలకృష్ణ.

నమ్మకంతో గెలిపిస్తే.. నీలి చిత్రాలు చూపిస్తావా..?
X

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సభ్యసమాజం తలదించుకునే పనిచేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ మాధవ్‌ వారికి సేవ చేయాల్సింది పోయి, నీలి చిత్రాలు చూపించారని విమర్శించారు. ఇలాంటి పనిచేసిన ఎంపీ ఢిల్లీ నుంచి ఏదో ఘన కార్యం చేసినట్టు అనంతపురం వచ్చారని, ఏ మొహం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేశారని మండిపడ్డారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్‌ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు బాలకృష్ణ.

సత్యసాయి జిల్లా లేపాక్షిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్ర ప్రజలను వైసీపీ మోసం చేసిందన్నారు. చేతకాని పాలనతో ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారని విమర్శించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. కనీసం ఎరువులు, విత్తనాలను కూడా రాయితీపై ఇవ్వలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ దౌర్భాగ్యం అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రైతుల్ని కూడా తీవ్రంగా మోసం చేసిందన్నారు బాలకృష్ణ. హిందూపురంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన బాల‌కృష్ణ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బాదుడే బాదుడులో వైసీపీపై విమర్శలు ఎక్కు పెట్టారు.

ఆరోగ్య రథంపై బాబు ఫొటో కట్..

ఇక బాలకృష్ణ తన సొంత నిధులతో ఎన్టీఆర్ ఆరోగ్యరథం అనే వాహనాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. భార్య వసుంధరతో కలసి ఆయన ఈ వాహనాన్ని ప్రారంభించారు. అయితే ఈ వాహనంపై ఎన్టీఆర్, బాలకృష్ణ ఫొటోలు మాత్రమే ఉండటం చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ఫొటో లేకుండానే బాలయ్య ఈ వాహనాన్ని రూపొందించారని, బావపై తనకున్న కోపాన్ని అలా చూపించారని వైసీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.

First Published:  18 Aug 2022 1:54 AM GMT
Next Story