Telugu Global
Andhra Pradesh

తండ్రికి చేసిన ద్రోహాన్ని మరచిపోయారా..?

కన్నతండ్రికే వెన్నుపోటు పొడిచిన పురందేశ్వరి ఇక రాష్ట్రప్రజలకు వెన్నుపోటు పొడవరని గ్యారెంటీ ఏముంది..? ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో జనాలకు పురందేశ్వరి వెన్నుపోటు పొడిచిన విషయం తెలిసిందే.

తండ్రికి చేసిన ద్రోహాన్ని మరచిపోయారా..?
X

తండ్రి హత్యకేసులో చెల్లెలు సునీతకే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి సేవచేస్తారు..? సొంత చెల్లెల్నే ఇంటినుండి వెళ్ళగొట్టిన జగన్ ఇక ప్రజలకు ఏమి న్యాయంచేస్తారు..? ఇవి ప్రజాపోరు సభలో బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు విన్నతర్వాత పురందేశ్వరి వ్యవహారం అచ్చంగా గురువింద గింజలాగే అనిపిస్తోంది. వివేకాహత్య దర్యాప్తును కంపుచేసిందే సునీత. తన తండ్రి హత్యకు టీడీపీలోని ఆయన ప్రత్యర్థులే కారణమని సునీతే ఆరోపించారు.

తర్వాత‌ ఏమైందో తెలీదు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి కీలకమన్నారు. ఇప్పుడేమో జగన్ పాత్రపైన కూడా దర్యాప్తు చేయాలని సీబీఐని డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో ఆరోపించిన టీడీపీ ప్రత్యర్థులతోనే ఇప్పుడు సునీత కలిసిపోయారు. హత్యచేసిన వారిలో దస్తగిరి హ్యాపీగా బయటతిరుగుతున్నా సునీత పట్టించుకోవటంలేదు. దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని వివేకాకు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి వేసిన పిటీషన్ను సునీత వ్యతిరేకించారు. దీంతోనే అందరికీ సునీత వైఖరిపైనే అనుమానాలు పెరిగిపోయాయి. అయితే చంద్రబాబు, పురందేశ్వరి, ఎల్లోమీడియా మాత్రం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు.

ఇక షర్మిల విషయంచూస్తే.. అన్నాచెల్లెళ్ళ మధ్య సమస్య ఏమిటో ఎవరికీ తెలీదు. వివాదం వాస్తవం కాబట్టే జగన్ నుండి షర్మిల వేరుపడి ఇప్పుడు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. దీనికి కూడా చంద్రబాబు, ఎల్లోమీడియానే కారణమనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది వాస్తవం. తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబుతో దగ్గుబాటి పురందేశ్వరి చేతులు కలిపింది ఇంకా వాస్తవం. చంద్రబాబుతో ఎన్టీఆర్ సంతానమంతా చేతులు కలిపి తండ్రికి వెన్నుపోటు పొడిచి చావుకు కారణమయ్యారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. చనిపోయేముందు ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియోలే దీనికి సాక్ష్యం.

కన్నతండ్రికే వెన్నుపోటు పొడిచిన పురందేశ్వరి ఇక రాష్ట్రప్రజలకు వెన్నుపోటు పొడవరని గ్యారెంటీ ఏముంది..? ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో జనాలకు పురందేశ్వరి వెన్నుపోటు పొడిచిన విషయం తెలిసిందే. చెల్లెళ్ళ విషయంలో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న పురందేశ్వరి మరి తండ్రికి వెన్నుపోటుపొడిచిన విషయంలో జనాలకు ఎప్పుడైనా సంజాయిషీ ఇచ్చుకున్నారా..? తప్పుచేశామని క్షమాపణలు చెప్పుకున్నారా..?

First Published:  6 March 2024 4:44 AM GMT
Next Story