Telugu Global
Andhra Pradesh

ప్రచారాన్ని ఎంజాయ్ చేస్తున్నారా?

పార్టీ మారుతారని జరిగిన ప్రచారాన్ని గంటా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తన గురించి మీడియాలో అలాంటి ప్రచారం జరగటమే కావాలని అన్నట్లుగా గంటా వ్యవహరించారు.

ప్రచారాన్ని ఎంజాయ్ చేస్తున్నారా?
X

పార్టీ మారే విషయంలో గడచిన మూడున్నరేళ్ళల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపైన జరిగినంత ప్రచారం మరెవరి విషయంలోను జరగలేదు. ఇంత ప్రచారం జరగటానికి కారణం ఆయన వ్యవహార శైలే అనటంలో సందేహం లేదు. విశాఖ నగరం ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా టీడీపీ తరపున గెలిచారు. గంటా స్వభావం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ తానున్న పార్టీ ప్రతిపక్షంలో ఉంటే వెంటనే అధికార పార్టీలోకి జంప్ అవుతారు.

అయితే ఇప్పుడు అది సాధ్యం కాలేదు. అందుకనే మూడున్నరేళ్ళుగా టీడీపీలో ఉన్నారో లేదో అన్నట్లుగానే ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే పార్టీ మార్పు విషయంలో ఆయన మాట్లాడారు. పార్టీ మార్పు విషయంలో జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తు తాను పార్టీ మారుతున్నట్లు ఎప్పుడైనా చెప్పానా అని మీడియానే నిలదీశారు. పార్టీ మారేట్లుగా ఉంటే మీడియాకు చెప్పే మారుతానంటు ఎగతాళిగా మాట్లాడారు. నిజమే తాను పార్టీ మారుతున్నట్లు గంటా తనంతట తానుగా ఎవరికీ చెప్పలేదు.

అయితే పార్టీ మారను టీడీపీలోనే ఉంటానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు ప్రకటించాలంటే పార్టీకి దూరంగా ఉంటున్నారు కాబట్టే. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు, చంద్రబాబునాయుడు వచ్చినపుడు కనబడటం లేదు. చంద్రబాబు పిలిచినా మీటింగులకు వెళ్ళలేదు. మరిలాంటపుడు గంటా టీడీపీలోనే ఉంటున్నారని, ఉంటారని ఎవరైనా ఎలా అనుకుంటారు? పైగా పార్టీ మారబోతున్నారు అని మీడియాలో జరిగిన ప్రచారాన్ని గంటా ఏనాడూ ఖండించలేదు. కాపులకు ప్రత్యేక పార్టీ ఉండాలని జరిగిన ప్రయత్నాల్లో సీరియస్‌గా పాల్గొన్నది నిజం కాదా?

పైగా పార్టీ మారుతారని జరిగిన ప్రచారాన్ని గంటా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తన గురించి మీడియాలో అలాంటి ప్రచారం జరగటమే కావాలని అన్నట్లుగా గంటా వ్యవహరించారు. అంటే పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ఎంకరేజ్ చేస్తున్నట్లే. పార్టీ మార్పు ప్రచారాన్ని ఒకవైపు బాగా ఎంజాయ్ చేస్తూనే, మరో వైపు తాను పార్టీ మారితే మీడియాకు చెప్పానా అని అడగటం గంటాకే చెల్లింది.

First Published:  13 Dec 2022 6:52 AM GMT
Next Story