Telugu Global
Andhra Pradesh

కారు కొని పార్టీ చేసుకున్నారు.. అంత‌లోనే ప్రాణాలు కోల్పోయారు

తాడిపత్రి పట్టణానికి చెందిన మోహన్‌రెడ్డి (27) రెండు రోజుల కిందట సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు.

కారు కొని పార్టీ చేసుకున్నారు.. అంత‌లోనే ప్రాణాలు కోల్పోయారు
X

కారు కొన్న సంద‌ర్భాన్ని స్నేహితుల‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోవాల‌నుకున్నాడు.. న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి గ్రామ శివారులోని ఓ ప్రాంతంలో విందు ఏర్పాటు చేశాడు. తిరుగు ప్ర‌యాణంలో కారు అదుపు త‌ప్పి చెట్టును బ‌లంగా ఢీకొన‌డంతో ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, మ‌రొక‌రు ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ప్రాణాలొదిలారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామ స‌మీపంలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన మోహన్‌రెడ్డి (27) రెండు రోజుల కిందట సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఈ సంద‌ర్భంగా పార్టీ చేసుకుందామ‌ని త‌న స్నేహితులైన విష్ణుచౌదరి (24), నరేశ్ రెడ్డి (27), మధుసాగర్ రెడ్డి (28), శ్రీనివాసరెడ్డిల‌తో క‌లిసి శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని ఓ ప్రాంతంలో విందు ఏర్పాటు చేశాడు. ఈ సంద‌ర్భంగా మ‌ద్యం కూడా సేవించిన వీరు శ‌నివారం తెల్ల‌వారుజామున 3.30 గంట‌ల స‌మ‌యంలో ప‌ట్ట‌ణానికి తిరిగి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ ఘ‌ట‌న‌లో మోహ‌న్‌రెడ్డి, విష్ణుచౌద‌రి, న‌రేశ్‌రెడ్డి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌ధుసాగ‌ర్ రెడ్డి ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎగిరి ప‌క్క‌నే ఉన్న మిద్దెపై ప‌డ‌టంతో అత‌న్ని ఎవ‌రూ గుర్తించ‌లేదు. ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో మిద్దె పైనుంచి అరుపులు వినిపించ‌డంతో స్థానికులు గ‌మ‌నించి తొలుత తాడిప‌త్రి ప్ర‌భుత్వాస్ప‌త్రికి.. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంత‌పురం త‌ర‌లిస్తుండ‌గా మార్గంలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీ‌నివాస‌రెడ్డి స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్ర‌మాదానికి అతివేగం లేదా మ‌ద్యం మ‌త్తు కార‌ణ‌మై ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

First Published:  6 Aug 2023 3:01 AM GMT
Next Story