Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్, కోడెల మరణాలపై ఎందుకు విచారణ జరపలేదు? - టీడీపీ పుస్త‌కంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి పేర్ని నాని

కడప ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపిస్తున్నారు కదా ఆయన పేరు చార్జీషీట్‌లో ఎందుకు చేర్చలేదని ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీది చేతకాని ప్రభుత్వమా అంటూ ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్, కోడెల మరణాలపై ఎందుకు విచారణ జరపలేదు?    - టీడీపీ పుస్త‌కంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి పేర్ని నాని
X

వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై తెలుగుదేశం పార్టీ ప్రచురించిన పుస్తకంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య జరిగితే, మే ఆఖరి వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు ఎఫ్ఐఆర్‌లో అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల‌ పేరు ఎందుకు చేర్చలేదని నాని ప్రశ్నించారు. అంతేకాదు.. శవపంచనామా సమయంలో కూతురు, అల్లుడు, భార్య, కొడుకుతో స్టేట్‌మెంట్‌ ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపిస్తున్నారు కదా ఆయన పేరు చార్జీషీట్‌లో ఎందుకు చేర్చలేదని ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీది చేతకాని ప్రభుత్వమా అంటూ ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ మృతిపై ఎందుకు పుస్తకం ప్రచురించలేదు?

స్వర్గీయ ఎన్టీ రామారావు మృతిపై సాక్షాత్తు ఆయన కొడుకు హరికృష్ణ అనుమానాలు వ్యక్తం చేశారని, ఎన్టీఆర్ మృతిపై సీబీసీఐడీతో ఎందుకు విచారణ చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మృతిపై అనుమానాలున్నాయని, చంద్రబాబే కారణమని ఆయన భార్య లక్ష్మీపార్వతి కూడా ఆరోపించిన సంగతి గుర్తులేదా అని నిల‌దీశారు. హరికృష్ణ, లక్ష్మీపార్వతి స్టేట్‌మెంట్‌ను పరిగణన‌లోకి తీసుకుని పుస్తకం ఎందుకు వేయలేదన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటుపై విచారణ ఎందుకు చేయలేదన్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయ క్రీడల్లో ఇదో భాగమని పేర్ని నాని మండిప‌డ్డారు.

చంద్రబాబు డైరెక్షన్లో సీబీఐ నడుస్తోందా?

అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తే ఆయన స్టేట్‌మెంట్ ఎలా బయటికొచ్చిందని పేర్ని నాని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్ టీడీపీ ప్రచురించిన పుస్తకంలో వచ్చిందంటే క‌చ్చితంగా సీబీఐలో చంద్రబాబు మనుషులు ఉన్నట్టేనని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ కూడా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నట్టేనని నాని అన్నారు,

మాజీ స్పీకర్ కోడెల ఫోన్ ఎందుకు ధ్వంసం చేశారు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బలవన్మరణం చెందితే.. ఎందుకు పుస్తకం వేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ ఫోన్‌ను తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని నిల‌దీశారు. కోడెల శివప్రసాద్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్లే చనిపోయారని ఆరోపించిన టీడీపీ నేతలు.. ఎందుకు సీబీఐ విచారణను అడగలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల ఎన్టీఆర్ కూతురు ఒకరు మరణించారని.. ఆ ఘ‌ట‌న‌పై సీబీఐ విచారణను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

టీడీపీ విడుదల చేసిన పుస్తకంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఫొటో వేశారని, మీ ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఆడవాళ్లా? ఇతరుల ఇళ్లలో ఆడవాళ్లకు ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం ఉండదా? అని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయం కోసం ఇంట్లో ఆడవాళ్లను బయటకు తీసుకొచ్చి బోరుబోరున ఏడ్చాడని విమర్శించారు. ఎదుటివాళ్ల ఇంట్లో ఆడవాళ్లను కూడా బయటకు తీసుకొచ్చే నీచమైన సంస్కృతి చంద్రబాబుదని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులతో పోటీగా రాజకీయాలు చేయాల్సి రావడం వైఎస్సార్‌సీపీ దురదృష్టమ‌ని ఆయ‌న చెప్పారు.

First Published:  12 Feb 2023 4:21 AM GMT
Next Story