Telugu Global
Andhra Pradesh

జగన్ వెంటే నా ప్రయాణం..! - మాజీ మంత్రి మేకతోటి సుచరిత

సోష‌ల్ మీడియాలో ఎవ‌రో ఏదో ఊహించుకొని పోస్టులు పెడితే దానిని ఆధారంగా చేసుకుని ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తున్నాయ‌న్నారు.

జగన్ వెంటే నా ప్రయాణం..! - మాజీ మంత్రి మేకతోటి సుచరిత
X

తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వీడే ప్ర‌సక్తే లేద‌ని మాజీ హోంశాఖ మంత్రి, గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత స్ప‌ష్టం చేశారు. త‌న‌పై జ‌రుగుతున్న‌ది త‌ప్పుడు ప్ర‌చారం మాత్ర‌మేన‌ని ఆమె కొట్టిపారేశారు. గుంటూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సుచ‌రిత మాట్లాడారు. సోష‌ల్ మీడియాలో ఎవ‌రో ఏదో ఊహించుకొని పోస్టులు పెడితే దానిని ఆధారంగా చేసుకుని ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తున్నాయ‌న్నారు.

పార్టీ మారాల్సి వ‌స్తే.. గృహిణిగా మాత్ర‌మే ఉంటా..

తాను పార్టీ మారాల్సి వస్తే గృహిణిగా మాత్రమే ఉంటానే తప్ప వేరే పార్టీల్లోకి మారనని ఈ సంద‌ర్భంగా సుచ‌రిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కులం, మతం ప్రాంతాలు చూడకుండా పథకాలు అందిస్తున్నారని, అటువంటి నాయకుడి వెంటే తన ప్రయాణం సాగుతుందని చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 సీట్లు ఖాయం..

ప్రజల మంచి కోరుకునే పార్టీలకు ప్రజాక్షేత్రంలో కూడా మంచే జరుగుతుందని సుచ‌రిత చెప్పారు. 2024లో జ‌రిగే ఎన్నికల్లో తమ పార్టీ 175కి 175 సీట్ల‌లోనూ విజ‌యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం తమ పార్టీ అధిష్టానానికి లేదని, అధిష్టానం అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని ఆమె చెప్పారు. రాజకీయంగా ఎవరో అణచివేస్తే అణచివేయబడరని.. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుందని మాజీ హోంమంత్రి సుచ‌రిత స్ప‌ష్టం చేశారు. .

First Published:  2 Feb 2023 8:42 AM GMT
Next Story