Telugu Global
Andhra Pradesh

మరోసారి ఇలా రాస్తే బట్టలూడదీసి కొడతాం..

పట్టాభిని కొట్టారంటూ 2021 నాటి ఫొటోలను ప్రచురించేందుకు సిగ్గులేదా అని ఈనాడు అధినేతను ప్రశ్నించారు. మరోసారి ఇలా చేస్తే రామోజీరావును బట్టలూడదీసి కొడతామన్నారు.

మరోసారి ఇలా రాస్తే బట్టలూడదీసి కొడతాం..
X

ఈనాడు రామోజీరావు ఆటలు చెల్లుబాటు అయ్యే కాలం పోయిందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు మద్దతు ఇచ్చి, ఎన్టీఆర్ ఫొటోలను ప్రచురించుకుని పత్రిక సర్క్యూలేషన్‌ పెంచుకున్న వ్యక్తి రామోజీరావు అని విమర్శించారు. తానే ఎన్టీఆర్‌ను సీఎంను చేశానన్న భ్రమతో ఆయన దగ్గరకు వెళ్లిన రామోజీరావు తను చెప్పినట్టు వినాలన్నారని కొడాలి చెప్పారు. అందుకు ఎన్టీఆర్‌ నా బొమ్మలేసుకుని సర్క్యూలేషన్ పెంచుకున్నావ్ అంటూ రివర్స్‌లో కౌంటర్‌ ఇచ్చారని గుర్తుచేశారు.

తనను పట్టించుకోలేదనే ఎన్టీఆర్‌పై నిందలేసిన వ్యక్తి ఈనాడు రామోజీరావు అని విమర్శించారు. చంద్రబాబు అయితే జనంలో సొంత బలం లేదు కాబట్టి తాను చెప్పినట్టు వింటాడని ఎన్టీఆర్‌ను దించేశారన్నారు.

గన్నవరం ఘటన బీసీలపై దాడి అంటున్న చంద్రబాబు.. మరి అరెస్ట్‌ అయిన బీసీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించకుండా కేవలం పట్టాభి ఇంటికి మాత్రమే ఎందుకెళ్లారని ప్రశ్నించారు. టీడీపీలోని కమ్మకులం నేతలంతా పట్టాభి భార్యను మాత్రమే ఎందుకు పరామర్శించారని నిలదీశారు. మిగిలిన వారికి భార్య పిల్లలు లేరా అని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌ వేదికగా రామోజీరావు వేల ఎకరాలు దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయిన తర్వాత పత్రికకు యాడ్స్ రావడం లేదని.. విశాఖలో వేల ఎకరాలు దోచిపెట్టలేదని రామోజీరావుకు కోపం అన్నారు. పైగా జగన్‌ సొంతంగా మీడియా పెట్టి రామోజీరావు గురించి బయటి ప్రపంచానికి తెలియజేశారని, ఆ కోపంతోనే జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

పట్టాభిని కొట్టారంటూ 2021 నాటి ఫొటోలను ప్రచురించేందుకు సిగ్గులేదా అని ఈనాడు అధినేతను ప్రశ్నించారు. మరోసారి ఇలా చేస్తే రామోజీరావును బట్టలూడదీసి కొడతామన్నారు. పట్టాభినీ కొట్టారంటూ రాశారని.. ఏం పట్టాభి ఏమైనా ఆకాశం నుంచి దిగివచ్చారా అని కొడాలి ఫైర్ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక కాటా సరుకని.. కిలోల లెక్కన అమ్ముకోడానికి తప్పా దేనికి పనికి రాదన్నారు. కన్నా పనికి రాని సరుకనే అధ్యక్ష పదవి నుంచి దించేశారన్నారు.

First Published:  23 Feb 2023 11:16 AM GMT
Next Story