Telugu Global
Andhra Pradesh

ఏసీబీ సీఐని ఢీకొట్టి.. పొలాల్లోంచి ప‌రుగులు.. - సినిమా సీన్‌ని త‌ల‌పించేలా ఏఈ ఎస్కేప్‌

కనెక్షన్ ఇవ్వడానికి రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన ఏఈ.. రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం డిమాండ్‌ చేయగా, స‌ద‌రు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ సీఐని ఢీకొట్టి.. పొలాల్లోంచి ప‌రుగులు.. - సినిమా సీన్‌ని త‌ల‌పించేలా ఏఈ ఎస్కేప్‌
X

ఏసీబీ అధికారులు దాడి చేస్తే.. వారినుంచి త‌ప్పించుకునేందుకు సినిమా సీన్ క్రియేట్ చేశాడో విద్యుత్ శాఖ అధికారి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

ములక్కాయవలసకు చెందిన రైతు డి.ఈశ్వరరావు తన పొలానికి కనెక్షన్ మంజూరు చేయాలని విద్యుత్‌ ఏఈ శాంతారావును కోరారు. దరఖాస్తు పేరుతో ఫోన్‌పే ద్వారా రూ.4 వేలు ఆయన సూచించిన మేరకు చెల్లించారు. కనెక్షన్ ఇవ్వడానికి రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన ఏఈ.. రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం డిమాండ్‌ చేయగా, స‌ద‌రు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

పొలాల్లోంచి ఎస్కేప్‌..

ఏసీబీ అధికారుల ప్ర‌ణాళిక ప్ర‌కారం.. విద్యుత్‌ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం మిగిలిన లంచం డబ్బులు పొలం దగ్గర ఇస్తానని రైతు చెప్పడంతో ఏఈ శాంతారావు అంగీకరించారు. రాత్రి పొలం దగ్గరకు వచ్చిన ఏఈ కారులో కూర్చుని ఈశ్వరరావును వాహనంలోకి రమ్మని పిలిచి మిగిలిన రూ.40 వేలు తీసుకున్నారు. అప్పటికే దూరంగా మాటువేసి ఉండి.. ఇదంతా గమనిస్తున్న ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, సీఐ టి. శ్రీనివాసరావులు బైక్‌పై కారు వద్దకు చేరుకున్నారు. వారిని గమనించిన ఏఈ కారును పక్కనే ఉన్న‌ పొలాల్లోకి వేగంగా నడిపారు. పొలంలో గట్ల పైనుంచి కారు వెళ్లడాన్ని గ‌మ‌నించిన రైతులు ఆశ్చర్యపోయారు. కారును అడ్డగించి ఏఈని పట్టుకునేందుకు బైకుపై సీఐ కొంతదూరం వెంబడించారు. ఏఈ కారుతో బైక్‌ను ఢీకొట్టడంతో సీఐ కిందపడి గాయాలపాలయ్యారు. కొంతదూరం వెళ్లాక లంచం డబ్బులు విసిరేసి, కారు వదిలేసి పొలాల్లో ప‌రుగులు పెట్టి పారిపోయారు.

తీవ్ర చ‌ర్య‌లు త‌ప్పవు : ఏసీబీ డీఎస్పీ

లంచం తీసుకుని తప్పించుకుపోవడమే కాకుండా పట్టుకునేందుకు యత్నించిన సీఐ వాహనాన్ని ఢీకొట్టి ఆయ‌న్ని గాయ‌ప‌ర‌చిన‌ ఏఈపై తీవ్ర చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు హెచ్చరించారు. ఆయన విద్యుత్‌ శాఖ ఎస్ఈకి ఫోన్ చేసి మాట్లాడారు. శాంతారావు స్వచ్ఛందంగా లొంగిపోకుంటే పరిస్థితి వేరేగా ఉంటుందని హెచ్చ‌రించారు. విషయం తెలుసుకున్న ఏడీఈ శంకరరావు మక్కువలోని కార్యాలయానికి చేరుకుని ఏసీబీ అధికారులకు వివరాలు అందించారు. శాంతారావు నేపథ్యాన్ని అధికారులు అర్ధరాత్రి వరకూ సేకరించారు. ఈ ఘ‌ట‌న‌ను మాత్రం తేలిగ్గా వ‌దల‌బోమ‌ని వారు స్ప‌ష్టం చేశారు.

*

First Published:  28 Aug 2023 5:26 AM GMT
Next Story