Telugu Global
Andhra Pradesh

రామోజీరావు ఈనాడుకు సోకిన ‘అతిసార’ వ్యాధి

న్యూమోనియా లక్షణాలతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందంటూ ఈ నెల 15వ తేదీన మళ్లీ ఆస్పత్రికి వచ్చాడు. అంటువ్యాధుల ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చేసిన సూచనను పెడచెవిన పెట్టాడు.

రామోజీరావు ఈనాడుకు సోకిన ‘అతిసార’ వ్యాధి
X

రామోజీరావు కట్టుకథల భారతాన్ని ఆపడం లేదు. అబద్ధాల పుట్టగా ఈనాడును మార్చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన తన పత్రికను దిగజారుస్తున్నారు. ‘కలుషిత జలం కాటేసింది’ అంటూ తప్పుడు వార్తను అచ్చేశారు. చికెన్‌ పాక్స్‌, న్యూమోనియాలతో మహ్మద్‌ ఇక్బాల్‌ శుక్రవారంనాడు మరణించాడు. అయితే, అతను డయేరియాతో మరణించాడని, గుంటూరు నగరంలో కలుషిత జలానికి అతను మృత్వువాత పడ్డాడని ఓ అబద్ధాన్ని ప్రచారంలో పెట్టాడు.

గుంటూరులో నివాసం ఉంటున్న ఇక్బాల్‌ ఈ నెల 11వ తేదీ సాయంత్రం విరేచనాలు, ఒంటి మీద చీము పొక్కులతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించడంతో విరేచనాలు తగ్గాయి. పొక్కులను చికెన్‌ పాక్స్‌గా వైద్యులు గుర్తించారు. షుగర్‌ లెవల్స్‌ 400 దాటింది. దీంతో డెర్మటాలజీ వైద్యులు పరీక్షించి గోరంట్లలోని అంటువ్యాధుల ఆస్పత్రిలో చేరాలని సూచించారు. అయితే అతను అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఉండకుండా వెళ్లిపోయాడు.

న్యూమోనియా లక్షణాలతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందంటూ ఈ నెల 15వ తేదీన మళ్లీ ఆస్పత్రికి వచ్చాడు. అంటువ్యాధుల ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చేసిన సూచనను పెడచెవిన పెట్టాడు. చికెన్‌ పాక్స్‌, న్యూమోనియాలతో బాధపడుతూ మర్నాడు తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రికి వచ్చిన అరగంటలో అతను మరణించాడు.

చికెన్‌ పాక్స్‌, అదుపులో లేని మధుమేహం, న్యూమోనియా లక్షణాలతో మరణించాడని వైద్యులు నివేదిక ఇచ్చారు. అతను అనారోగ్యం వల్లనే మరణించాడని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఇక్బాల్‌ నివాసం ఉన్న రైలుపేట ప్రాంతాలలో మంచినీటి నమూనాలను సేకరించి పరీక్షించారు. నీరు కలుషితం కాలేదని నివేదికలో తేలింది.

ఈ నెల 10వ తేదీన మరణించిన ఎం. పద్మ కూడా కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వాంతులు, విరేచనాలతో రెండు రోజుల పాటు ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకుని చివరి నిమిషంలో జీజీహెచ్‌కు వచ్చింది. ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించింది. దీన్ని కూడా అతిసారా మరణంగా ఈనాడు వక్రీకరించి చెప్పింది.

First Published:  19 Feb 2024 9:18 AM GMT
Next Story