Telugu Global
Andhra Pradesh

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ నింపొద్దు - బంక్ నిర్వాహకులకు ఈసీ ఆదేశం

పల్నాడు, మాచర్ల, తిరుపతి, తాడిపత్రితో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన రోజు కూడా పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి.

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ నింపొద్దు - బంక్ నిర్వాహకులకు ఈసీ ఆదేశం
X

ఏపీలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాటిళ్లలో, కంటైనర్లలో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ విక్రయించొద్దని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి.

పల్నాడు, మాచర్ల, తిరుపతి, తాడిపత్రితో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన రోజు కూడా పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. ఈ ఘటనలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో ఈసీ సీరియస్ అయింది. విచారణ జరిపిన అనంతరం ఈ ఘటనలకు బాధ్యులైన పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పెట్రోల్ బంక్ నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపాలని ఆదేశాలు ఇచ్చింది. బాటిళ్లలో పెట్రోల్ నింపొద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించి బాటిళ్లలో పెట్రోల్ నింపితే బంకు లైసెన్స్ ను రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా ఏపీలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది.

First Published:  19 May 2024 9:41 AM GMT
Next Story