Telugu Global
Andhra Pradesh

మా పీక కోసే పనిచేస్తామంటే మాకు అంగీకారం కాదు..- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. మా పీక కోస్తామంటే మేమెందుకు ఒప్పుకుంటాం.. అని ఆయ‌న నిల‌దీశారు. 3 రాజ‌ధానుల అంశంపై రాజ‌మండ్రిలో సోమ‌వారం నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

మా పీక కోసే పనిచేస్తామంటే మాకు అంగీకారం కాదు..- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
X

విశాఖ రాజధానిగా వద్దనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.. అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. మా పీక కోస్తామంటే మేమెందుకు ఒప్పుకుంటాం.. అని ఆయ‌న నిల‌దీశారు. 3 రాజ‌ధానుల అంశంపై రాజ‌మండ్రిలో సోమ‌వారం నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

విభజన సమయంలో నియమించిన మేధావుల కమిటీ సూచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆయ‌న స్పష్టం చేశారు. విభజన కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ఇప్పటికీ చట్టబద్ధత ఉందన్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణే త‌మ నినాదం అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మ‌రోమారు తేల్చిచెప్పారు. మేధావుల కమిటీ సూచనలను చంద్రబాబు తుంగలో తొక్కి.. తన కేబినెట్ మంత్రి నారాయణతో కమిటీ వేసి తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్లే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ గా మిలిగిపోయిందని ధ్వజమెత్తారు. 9 ఏళ్ళు అయినా రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణమ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇప్పుడున్న అమ‌రావ‌తి నిర్మాణానికి ప‌ది ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని తేలింద‌ని, అంత మొత్తం ఓ రాజ‌ధాని నిర్మాణానికి వెచ్చించే స్థితిలో రాష్ట్ర ప్ర‌భుత్వం లేద‌ని ధ‌ర్మాన చెప్పారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఒక్క ఆంధ్ర ప్ర‌దేశ్ అనే కాదు, ఏ రాష్ట్రమైనా ఇప్పటికిప్పుడు ప‌ది వేల కోట్ల రూపాయ‌లు కూడా ఖ‌ర్చు చేయ‌లేని స్థితిలో ఉన్నాయ‌ని అన్నారు.

చంద్ర‌బాబు త‌న సొంత మ‌నుషుల ల‌బ్ధి కోస‌మే అమ‌రావ‌తి ప్ర‌తిపాద‌న‌ను బ‌ల‌పరుస్తూ మాట్లాడుతున్నార‌ని ధ‌ర్మాన చెప్పారు. ఇప్ప‌టికైనా మేధావులు ఆలోచించాలని కోరారు. విశాల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌తిపాద‌న‌లను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మీ ప్రాంతంలో అడుగు పెట్ట‌డానికి వీలులేకుండా మేం ఇక్క‌డ విదేశీ పౌరులుగా ఉండాలా అని ప్ర‌శ్నించారు. క్యాపిట‌ల్ కోసం 55 వేల ఎక‌రాలు ఎందుకు. అని నిల‌దీశారు. కేవ‌లం చంద్ర‌బాబు నిర్ణ‌యాల కార‌ణంగా తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేశార‌ని విమర్శించారు. స‌హేతుక‌త లేని నిర్ణ‌యాలు వ‌ల్లే ఇదంతా జరిగిందన్నారు.

చంద్రబాబు కేవ‌లం త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెడుతున్నార‌ని ధ‌ర్మాన అన్నారు. అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌ధాని నిర్మాణానికి నాలుగు నుంచి ఐదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అవ‌సరం అవుతాయ‌ని, అంత మొత్తం ఒక ప్రాంతం అభివృద్ధికోసం వెచ్చిస్తే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. తాము మ‌రోసారి మోస‌పోయేందుకు సిద్ధంగా లేమ‌ని, మ‌ళ్లీ మ‌రో 70, 80 ఏళ్ల పాటు వెనుక‌బాటును భ‌రించేందుకు సిద్ధంగా లేమ‌ని తేల్చి చెప్పారు.

విశాఖ పరిపాలన రాజధాని వద్దని.. మీరు పాదయాత్ర చేస్తుంటే .. మేం నోరు మూసుకుని కూర్చోవాలా.. అని ధ‌ర్మాన ప్ర‌శ్నించారు. చంద్రబాబు తన పాలనలో.. శ్రీకాకుళానికి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇవ్వలేదని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీని తుంగలో తొక్కి...అమరావతిని తెర మీదకు తెచ్చారన్నారు. సీఎం హోదాలో చంద్రబాబు అంతా మాయ చేశారని, అబద్దాలాడారని తెలిపారు.

విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని...చంద్రబాబు అండ్ కో మాట్లాడటం తప్పని ధ‌ర్మాన చెప్పారు. అమరావతిలో క్యాపిటల్ వద్దని త‌మ ప్రభుత్వం చెప్పట్లేదని, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని, అందులో సందేహమే లేదని ధ‌ర్మాన స్ప‌ష్టం చేశారు. 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దని ఆయ‌న కోరారు. పాల‌కుల కృషితో.. రాష్ట్ర సంపద అన్న‌ది అందరికీ చెందాలన్నారు. ఒక రాష్ట్ర జనాభా సొమ్ము అంతా తీసుకుని వెళ్ళి 29 గ్రామాలని అభివృద్ది చేయడానికి పెట్టాలా? లేదా అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధానిగా, చేసుకుని ఇంకొంచెం సదుపాయాలు పెంచి,అక్కడ నుండి వచ్చే రెవెన్యుని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధికీ ఉపయోగించాలా ? ఏది ఈ రాష్ట్రానికి మంచిది ? అన్నది అంతా ఆలోచించాలని ఆయ‌న కోరారు.

రాష్ట్ర ప్రజలు రాజధాని రైతు ఉద్యమం పేరుతో న‌డుస్తున్న సెంటిమెంట్ రాజకీయాలకు అతీతంగా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని ధ‌ర్మాన కోరారు. హైదరాబాద్‌లో 75 ఏళ్లు పెట్టుబడి పెట్టి.. మనమంతా అభివృద్ది చేశామ‌ని, ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఆనాడే పెట్టుబడులు పెట్టి ఉంటే.. విభజన జరిగేది కాదని ధ‌ర్మాన చెప్పారు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తరువాత..మనం తప్పు చేశామని గ్రహించామ‌ని, మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెడితే..హైదరాబాద్‌లో చేసిన తప్పే చేసినట్లు అవుతుందని హెచ్చ‌రించారు. పెట్టుబడులు కేంద్రీకృతం కాకూడదనేది.. ప్రపంచమే చెబుతోంది అని ధర్మాన వివరించారు.

అమరావతిపై బాబు స్వార్థానికి అదే కారణం..!

అన్ని ప్రాంతాలకు అనుకూలమైన..మోడల్ గా రాజధాని ఉండాలని శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిందని ధ‌ర్మాన చెప్పారు. అన్ని ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే మోడల్‌ను.. చంద్రబాబు ఎందుకు అంగీకరించడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజ‌ధాని పేరిట 33వేల ఎకరాల భూములను సేక‌రించి..వాటి చుట్టూ మీరూ, మీ బంధువులు, మీ బినామీలు..మీ పార్టీ నేతలకు కొనిపెట్టారు. ఇదే కదా! మీ స్వార్థం అని చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. చంద్రబాబు స్వార్థం ప్రజలకు ఇవాళ తెలుస్తోంద‌న్నారు. ప్రజలు గుడ్డి వాళ్లు కాదన్నారు. త‌మ‌ ప్ర‌తిపాద‌న‌లు అనుస‌రించి, త‌మ‌ నిర్ణ‌యాలను అనుస‌రించి అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని వివ‌రించారు. అమరావతిలో రాజధాని లేదని చంద్రబాబు ఎలా చెబుతారని ధ‌ర్మాన ప్ర‌శ్నించారు.

విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని... రాయలసీమకు న్యాయ రాజధాని వద్దు అని చంద్రబాబు అండ్ కో మాట్లాడటం తప్పని ధ‌ర్మాన చెప్పారు. అమరావతిలో క్యాపిటల్ వద్దని త‌మ‌ ప్రభుత్వం చెప్పట్లేదని, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని స్ప‌ష్టం చేశారు. జీడీపీలో శ్రీ‌కాకుళం జిల్లా షేర్ ఏంటో చెప్పండి.. శ్రీ‌కాకుళం జిల్లా ఇవాళ్టికీ వెనుక‌బ‌డే ఉంది.. ఈ సమాజంలో ఎవ్వరూ గౌరవించని పనులు మా ప్రాంతం వాళ్లు చేస్తున్నారు... ఇలా ఎంత కాలం వెనుక‌బాటుత‌నంతోనే ఉండిపోవాలి.. ఆ విధంగా మా పీక కోసే పనిచేస్తామంటే మాకు అంగీకారం కాదు.. అని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

First Published:  3 Oct 2022 1:26 PM GMT
Next Story