Telugu Global
Andhra Pradesh

పెనమలూరు తెరపైకి కొత్త అభ్యర్థి.. బోడె ప్రసాద్‌, ఉమాకు మొండిచేయి

తుల్జా భవానీని బరిలో నిలిపితే కుల సమీకరణాలు కలిసిరావడంతో పాటు దేవినేని ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

పెనమలూరు తెరపైకి కొత్త అభ్యర్థి.. బోడె ప్రసాద్‌, ఉమాకు మొండిచేయి
X

కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైలవరం,పెనమలూరు స్థానాలను తెలుగుదేశం ఎవరికీ ఇస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మైలవరం టికెట్‌ను దాదాపు వసంతకృష్ణ ప్రసాద్‌కు ఖాయం చేసిన తెలుగుదేశం అధినేత.. పెనమలూరు టికెట్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైలవరం వసంతకు ఇస్తే.. పెనమలూరు తనకు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమాకు ఈ సారి టికెట్‌ ఇచ్చేదిలేదనే సంకేతాలు ఇచ్చారని సమాచారం .

పెనమలూరు నుంచి బోడె ప్రసాద్‌ను చంద్రబాబు సైడ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దేవినేని నెహ్రూ అన్న దేవినేని బాజీ ప్రసాద్‌ కోడలు తుల్జా భవానీకి పెనమలూరు టికెట్‌ కన్ఫామ్‌ చేసినట్లు తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. దేవినేని ఉమకు సైతం తుల్జా భవానీ దగ్గరి బంధువు.

తుల్జా భవానీని బరిలో నిలిపితే కుల సమీకరణాలు కలిసిరావడంతో పాటు దేవినేని ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథిని నూజివీడుకు పంపిన తెలుగుదేశం.. అక్కడ సీటు ఆశిస్తున్న పర్వతనేని గంగాధర చౌదరిని పెనమలూరు తీసుకువస్తారన్న మరో ప్రచారం కూడా నడుస్తోంది. మొత్తంగా ఈసారి బోడె ప్రసాద్‌, దేవినేని ఉమాలకు టికెట్‌ దక్కే పరిస్థితులు లేవని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

First Published:  15 March 2024 3:32 AM GMT
Next Story