Telugu Global
Andhra Pradesh

దావోస్ కి వెళ్లకపోయినా పర్లేదు.. మంత్రి అమర్నాథ్ కవరింగ్ కష్టాలు

దావోస్ సదస్సుకు ఏపీకి ఆహ్వానం అందలేదని టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని, కానీ నవంబర్ 25నే ముఖ్యమంత్రి పేరు మీద ఆహ్వానం అందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

దావోస్ కి వెళ్లకపోయినా పర్లేదు.. మంత్రి అమర్నాథ్ కవరింగ్ కష్టాలు
X

ఓవైపు దావోస్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కి వరల్డ్ టాప్ 30 ఇన్ ఫ్లూయెన్సర్ల లిస్ట్ లో చోటు దక్కింది. అదే సమయంలో మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి అసలు దావోస్ లో ప్రాతినిధ్యమే లేదు. ఏపీ తరపున ఎవరూ దావోస్ సమ్మిట్ కి వెళ్లలేదు. దీన్ని టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. అన్ని రాష్ట్రాలు పెట్టుబడులకోసం దావోస్ కి వెళ్తే, ఏపీ బృందం ఎక్కడుంది అని టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో దావోస్ సదస్సులో కచ్చితంగా ఏపీ పెవిలియన్ ఉండేదని, కానీ ఈ ఏడాది అసలు దావోస్ లో ఏపీ పేరే వినపడలేదని, దీనికి కారణం సీఎం జగనేనని విమర్శిస్తున్నారు. పరోక్షంగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా టీడీపీకి టార్గెట్ అయ్యారు. పక్క రాష్ట్రం మంత్రి టాప్ ఇన్ ఫ్లూయెన్సర్ గా టాప్ ప్లేస్ లో ఉంటే, ఈ రాష్ట్రం మంత్రికి అసలు ఆహ్వానమే లేదంటూ కంపేరిజన్ మొదలైంద. దీంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.


పిలిచారు, కానీ..!

దావోస్ సదస్సుకు ఏపీకి ఆహ్వానం అందలేదని టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని, కానీ నవంబర్ 25నే ముఖ్యమంత్రి పేరు మీద ఆహ్వానం అందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ఏపీ నెంబర్-1 స్థానంలో ఉందని, 97వేల కోట్ల రూపాయలు ఏపీ నుంచి ఎగుమతులు జరిగాయని వివరించారు. ముఖ్యమంత్రి చరిష్మా, హీరోయిజం చూసే పెట్టుబడులు వస్తున్నాయని.. అందుకు ప్రకృతి కూడా సహకరిస్తోందన్నారాయన.

మీరు వెళ్లి చేసిందేంటి..?

ఐదేళ్లలో దావోస్ వెళ్లి వచ్చిన టీడీపీ నేతలు పెట్టుబడులు తెచ్చామన్నారే కానీ, వాటికి సంబంధించిన పనులేవీ మొదలు కాలేదన్నారు మంత్రి అమర్నాథ్. బిల్డప్ బాబు దావోస్‌కు వెళ్లి ప్రచారాలకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. మార్చి నెలలో ఏపీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సుతో.. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో సగటున ఏడాదికి 11వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రూ.15వేల కోట్ల పెట్టుబడులుగా వచ్చాయని చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికపై చంద్రబాబు మాట్లాడిన ఒక్క వీడియో అయినా టీడీపీ చూపించగలదా అని ప్రశ్నించారు.

First Published:  17 Jan 2023 5:06 PM GMT
Next Story