Telugu Global
Andhra Pradesh

ముంచుకొస్తున్న మిచౌంగ్ తుపాను.. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

తుపాను ఎఫెక్ట్ తో తిరుపతి నగరంతో పాటు తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో వర్షంతో పాటు పొగ మంచు దట్టంగా క‌మ్ముకుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముంచుకొస్తున్న మిచౌంగ్ తుపాను.. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
X

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీ వైపుగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు 20 కిలోమీట‌ర్లు, బాపట్లకు 110 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నం లోపు నెల్లూరు- మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తుపాను తీరం దాటనుంది. తుపాను ఎఫెక్ట్ తో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో భారీ వృక్షాలు నేలకూలాయి.

తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఏపీ ప్రభుత్వం 9 జిల్లాల‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

తిరుమలలో భారీ వర్షం

తుపాను ఎఫెక్ట్ తో తిరుపతి నగరంతో పాటు తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో వర్షంతో పాటు పొగ మంచు దట్టంగా క‌మ్ముకుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైన పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. తుపాను వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో టీటీడీ పలు ఆంక్షలు విధించింది. పాపవినాశనం, శ్రీవారి మెట్టు, కపిలతీర్థం, జాపాలి మార్గాలను మూసివేసింది. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనదారులకు పరిమితులు విధించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్ర‌భుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

First Published:  5 Dec 2023 5:45 AM GMT
Next Story