Telugu Global
Andhra Pradesh

ఇంతకంటే పెద్ద జోక్ మరొకటి ఉండదేమో..? టీడీపీపై అంబటి సెటైర్లు

చంద్రబాబు అరెస్ట్ అయిన కొద్దిరోజుల వరకు టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవరు చనిపోయినా చంద్రబాబు అరెస్టును భరించలేకే వారు చనిపోయారని టీడీపీ ప్రచారం చేసింది.

ఇంతకంటే పెద్ద జోక్ మరొకటి ఉండదేమో..? టీడీపీపై అంబటి సెటైర్లు
X

చంద్రబాబు అరెస్టు వార్త విని కార్యకర్తలు మరణించారనడం పెద్ద జోక్ అని మంత్రి అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులపై సెటైర్లు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో గత నెల టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపు నెలన్నర రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్టు వార్త విని పలువురు టీడీపీ కార్యకర్తలు మరణించారని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సందర్భంగా ఆయా బాధిత కుటుంబాలకు టీడీపీ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు వార్త విని కార్యకర్తలు మరణించారని చెప్పడం పెద్ద జోక్ గా మంత్రి అంబటి రాంబాబు అభివర్ణించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై అంబటి విమర్శలు చేశారు.


'బాబు అరెస్టు వార్త విని కార్యకర్తలు మరణించారనడం ఓ జోక్ అని.. మరణించిన వారిని పరామర్శించడానికి వెళ్లడం మరో జోక్ అని.. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎందుకురా జోకులేసి చంపుతారు!' అని మంత్రి అంబటి ట్వీట్ చేశారు. మంత్రి అంబటి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, చంద్రబాబు అరెస్ట్ అయిన కొద్దిరోజుల వరకు టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవరు చనిపోయినా చంద్రబాబు అరెస్టును భరించలేకే వారు చనిపోయారని టీడీపీ ప్రచారం చేసింది. అనారోగ్యంతో చనిపోయినా, గుండెపోటుతో మ‌ర‌ణించినా వారంతా చంద్రబాబు కోసం చనిపోయిన వారి జాబితాలో చేర్చినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ కార్యక్రమం చేపట్టనుండటంతో ఈ విషయమై సెటైర్లు పేలుతున్నాయి.

First Published:  19 Oct 2023 5:00 AM GMT
Next Story