Telugu Global
Andhra Pradesh

ఎన్టీయార్ కాయిన్‌ను ఎవరు తీసుకుంటారు?

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ప్రోటోకాల్ అనేది ఒకటుంటుంది. దాని ప్రకారం ముందు భార్యే వస్తారు. మరిప్పుడు కాయిన్‌ను ఎవరు తీసుకుంటారన్నది సస్పెన్సుగా మారిపోయింది.

ఎన్టీయార్ కాయిన్‌ను ఎవరు తీసుకుంటారు?
X

ఎన్టీయార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల నాణెం ఇప్పుడు సరికొత్త వివాదాన్ని రేపుతోంది. ఎలాగంటే ఆ కాయిన్‌ను ఈనెల 28వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయబోతున్నారు. ఎన్డీయార్ శత జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్న కాయిన్‌ని ఎవరు అందుకోబోతున్నారు? అన్నదే కీలకమైంది. 100 రూపాయాల కాయిన్‌ను విడుదల చేయబోతున్న సందర్భంగా మొత్తం ఎన్టీయార్ కుటుంబ సభ్యులందరినీ హాజరుకమ్మని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

ఎలాగూ ఆహ్వానం అందింది కాబట్టి కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరు హాజరవుతారు. ఈ ప్రోగ్రాంలో హాజరయ్యేందుకు వీలుగానే చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీలో అనేక కార్యక్రమాలను పెట్టుకున్నారు. వీళ్ళు హాజరవ్వటం అంతా బాగానే ఉంది మరి ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతి ఏం చేస్తారు అన్నదే కీలకమైంది. ఎందుకంటే రాష్ట్రపతి విడుదల చేయబోయే కాయిన్‌ను మొదట ఎవరు అందుకుంటారు?

మామూలుగా అయితే భార్యే అందుకోవాలి. భార్య తర్వాతే కుటుంబ సభ్యులు వస్తారు. కానీ ఇక్కడ లక్ష్మీపార్వతిని ఎన్టీయార్ శాస్త్రోక్తంగా అందరిముందు వివాహం చేసుకున్నా కుటుంబ సభ్యులెవరూ అంగీకరించటం లేదు. కుటుంబ సభ్యులు అంగీకరించటం, అంగీకరించకపోవటం అది వాళ్ళు వ్యక్తిగత లేదా కుటుంబ సమస్య. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ప్రోటోకాల్ అనేది ఒకటుంటుంది. దాని ప్రకారం ముందు భార్యే వస్తారు. మరిప్పుడు కాయిన్‌ను ఎవరు తీసుకుంటారన్నది సస్పెన్సుగా మారిపోయింది. ఎన్టీయార్ పేరుతో ఏ పురస్కారాన్ని అందించినా తానే అందుకోవాలని లక్ష్మీపార్వతి వాదిస్తున్నారు.

తమ తండ్రి పేరుతో ఇచ్చే పురస్కారాన్ని తామే తీసుకుంటామని కుటుంబ సభ్యులు అంటున్నారు. మరీ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. ఈ వివాదం కారణంగానే ఎన్టీయార్‌కు భారతరత్న పురస్కారం ఇప్పించటంలో చంద్రబాబు, కుటుంబ సభ్యులు వెనకాడుతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. భారతరత్న పురస్కారం అందుకునేందుకు లక్ష్మీపార్వతి హాజరైతే దాన్ని ఎవరూ కాదనేందుకు లేదు. ఒకవేళ ఏదైనా సమస్యయితే పెద్ద వివాదమైపోతుంది. అందుకనే ఎన్టీయార్‌కు పురస్కారాలను అందించే విషయంపై చంద్రబాబు ఇతరులు పట్టించుకోవటంలేదు. మరిప్పుడు కాయిన్‌ను మొదట ఎవరు అందుకుంటారో చూడాల్సిందే.


First Published:  25 Aug 2023 5:55 AM GMT
Next Story