Telugu Global
Andhra Pradesh

ఏపీలో కంటైనర్ పాలిటిక్స్.. లోకేష్ కి వైవీ ఘాటు రిప్లై

దొడ్డి దారిలో మంత్రి అయిన నారా లోకేష్ కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేమని హాట్‌ కామెంట్లు చేశారు వైవీ సుబ్బారెడ్డి.

ఏపీలో కంటైనర్ పాలిటిక్స్.. లోకేష్ కి వైవీ ఘాటు రిప్లై
X

విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. ఈలోగా సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి మరో కంటైనర్ వెళ్లిందని, అందులో ఏదో ఉందని టీడీపీ రాద్ధాంతం మొదలు పెట్టింది. నారా లోకేష్ కూడా ఈ కంటైనర్ పై రచ్చ చేస్తున్నారు. అందులో ఏముంది? బ్రెజిల్‌ సరుకా? మద్యంలో మెక్కిన వేలకోట్ల రూపాయలా? లండన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్‌ ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లా? దీనికి డీజీపీ సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు లోకేష్. కంటైనర్ వ్యవహారంలో లోకేష్ కి ఘాటు జవాబిచ్చారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.

అంత ఉలుకెందుకు..?

కంటైనర్ పేరు చెబితేనే టీడీపీ ఉలిక్కి పడుతోందని విమర్శించారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లిన కంటైనర్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారాయన. ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్‌ అందులో ఉందని చెప్పారు. ఎల్లో మీడియాతో కలసి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం కట్టిపెట్టాలన్నారు. వైజాగ్ పోర్ట్ కు వచ్చిన డ్రగ్స్ కంటైనర్, నారా లోకేష్ బంధువులదే అని ఆరోపించారు వైవీ సుబ్బారెడ్డి. అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి ఆ అనుమానం వస్తోందన్నారు. దొడ్డి దారిలో మంత్రి అయిన నారా లోకేష్ కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేమని హాట్‌ కామెంట్లు చేశారు వైవీ.

ఉత్తరాంధ్రలో ఓసీ అభ్యర్థులను బరిలో దింపిన టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి ఓటమి తప్పదని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర బీసీల అడ్డా అని చెప్పారు. వైసీపీ బీసీలకే పెద్దపీట వేసిందన్నారు. కూటమి అభ్యర్థులైన శ్రీ భరత్, సీఎం రమేష్‌ కి ఓటమి ఖాయమని చెప్పారు వైవీ. ఉత్తరాంధ్ర లో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతామని చెప్పారు.

First Published:  27 March 2024 10:47 AM GMT
Next Story