Telugu Global
Andhra Pradesh

గ్రామ స‌చివాల‌యాలు × జ‌న్మ‌భూమి క‌మిటీలు

తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనర‌ల్‌(కాగ్) సచివాలయ వ్యవస్థ‌ మీద నెగిటివ్‌గా కామెంట్ చేసింది. ఏ ఉద్దేశంతో కాగ్ కామెంట్‌ చేసిందో తెలీదుకానీ దాన్ని ఎల్లోమీడియా బూతద్దంలో చూపించేసింది.

గ్రామ స‌చివాల‌యాలు × జ‌న్మ‌భూమి క‌మిటీలు
X

గ్రామ, వార్డు సచివాలయాలంటే ఎల్లో మీడియాకు బాగా మండిపోతోంది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనర‌ల్‌(కాగ్) సచివాలయ వ్యవస్థ‌ మీద నెగిటివ్‌గా కామెంట్ చేసింది. ఏ ఉద్దేశంతో కాగ్ కామెంట్‌ చేసిందో తెలీదుకానీ దాన్ని ఎల్లోమీడియా బూతద్దంలో చూపించేసింది. ‘వార్డు సచివాలయ వ్యవస్థ‌ రాజ్యాంగ విరుద్ధం’ అనే బ్యానర్‌తో పే..ద్ద స్టోరీ అచ్చేసింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌర భాగస్వామ్యం లేకుండానే ఏర్పాటు చేశారట. స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీయటమే అని కాగ్ కామెంట్ చేసిందని ఎల్లోమీడియా చెప్పింది.

సరే కాగ్ ఏం చెప్పింది, ఎల్లోమీడియా ఏం రాసింది అనే విషయాన్ని పక్కనపెట్టేద్దాం. వార్డు, గ్రామ సచివాలయాలు జనాల్లో బాగా పాతుకుపోయాయి. వలంటీర్లు లక్షల మంది జనాల మనసులను గెలుచుకున్నారు. ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు తప్పులు చేస్తే చేయవచ్చు. మొత్తంమీద చూస్తే సచివాలయ వ్యవస్థ‌ పనితీరు మీద జనాలంతా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. జనాలకు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే వలంటీర్లకు ఫోన్లు చేస్తే వచ్చి విషయం తెలుసుకుని పనిచేసి పెడుతున్నారు.

ఒకటో తేదీ ఉదయం తలుపు తట్టి పెన్షన్ ఇవ్వటంతో మొదలుపెట్టి పథకాలు అందేవరకు జాగ్రత్తగా ఫాలోఅప్‌ చేస్తున్నారు. దీనివల్లే జనాల్లో వలంటీర్ల వ్యవస్థ‌ పాతుకుపోయింది. రాబోయే ఎన్నికల్లో ఈ వ్యవస్థే తమ కొంపముంచేస్తుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా టెన్షన్ పడుతున్నారు.

సచివాలయ వ్యవస్థ‌ రాజ్యాంగ విరుద్ధమైతే మరి చంద్రబాబు ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీల మాటేమిటి? టీడీపీ ఘోర ఓటమికి జన్మభూమి కమిటీలు కూడా కారణమే అని అందరికీ తెలిసిందే. మామూలు జనాలతో పాటు చివరకు పార్టీ జనాలను కూడ వదలకుండా పీక్కుతినేశాయి. జన్మభూమి కమిటీల ఏర్పాటుతో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీలు ఎందుకు పనికిరాకుండా పోయారు. జన్మభూమి కమిటీల అరాచకాలను పార్టీ నేతలే తట్టుకోలేకపోయారు.

జన్మభూమి కమిటీలను వెంటనే రద్దు చేయాలని నేతలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో చివరకు పార్టీలోనే జన్మభూమి కమిటీలపై తీవ్రంగా వ్యతిరేకత పెరిగిపోయింది. జనాల వ్యతిరేకతకు తోడు నేతల వ్యతిరేకత కూడా తోడై ఎన్నికల్లో చివరకు పార్టీ పుట్టి మునిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇదే కాగ్ అమరావతి కాన్సెప్టును తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజావేదికను, అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ఎండగట్టింది. చంద్రబాబు హయాంలోని అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలుచేసింది. వాటిని వదిలిపెట్టేసి జనాలు మెచ్చిన సచివాలయ వ్యవస్థ‌ మీద మాత్రం నెగిటివ్‌గా బ్యానర్ కథనం అచ్చేయటమే విచిత్రం.


First Published:  26 Sep 2023 6:42 AM GMT
Next Story