దాడిపై సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్
ఎప్పటిలాగే అందరినీ చిరునవ్వుతో పలకరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తనను కలిసిన పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి బయటపడ్డానని నేతలతో అన్నారు జగన్.
![దాడిపై సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్ దాడిపై సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్](https://www.teluguglobal.com/h-upload/2024/04/15/1319095-cm-jagans-first-reaction-to-stone-attacking-in-vijayawada-copy.webp)
నుదుటికి గాయం అయినా, కుట్లు పడినా, విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినా సీఎం జగన్ తగ్గలేదు. కేవలం ఒకరోజు విశ్రాంతితో మళ్లీ జనంలోకి వచ్చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నుంచి "మేమంతా సిద్ధం" బస్సు యాత్రను సీఎం జగన్ తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో సహా పలువురు సీనియర్ పార్టీ నేతలు జగన్ను కలిశారు. పరామర్శకు నాయకులు, కార్యకర్తలు వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి నుదుటి గాయంపై నేతలు వాకబు చేశారు. సీఎం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రితో అన్నారు.
ఇక ఎప్పటిలాగే అందరినీ చిరునవ్వుతో పలకరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తనను కలిసిన పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి బయటపడ్డానని నేతలతో అన్నారు జగన్. ఇలాంటి దాడులు తనను ఆపలేవన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని నాయకులతో అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు సీఎం జగన్.
ముఖ్యమంత్రిని పరామర్శించిన నేతలు వీళ్లే..
శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, ఒంగోలు వైయస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, పామర్పు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్ధి దేవినేని అవినాష్, మైలవరం అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు, డాక్టర్ దుట్టా రామచంద్రరావు సహా పలువురు ఇతర నేతలు.