Telugu Global
Andhra Pradesh

14న ఏపీలో 5 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం

విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి.

14న ఏపీలో 5 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి అందుబాటులోకి వ‌చ్చిన 5 ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌ను ఈ నెల 14న సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన మెడిక‌ల్ కాలేజీని జ‌గ‌న్ అక్క‌డికే వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్ గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. వీటిలో ఒక్కో కాలేజీలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నీట్ ద్వారా ఆలిండియా కోటా రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సిలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సిలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సిలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వీటితో పాటు మ‌రో 5 కాలేజీల ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని, వాటిని వ‌చ్చే ఏడాది ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఏపీఎంఎస్ఎస్ఐడీసీ ఎండీ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు.

*

First Published:  8 Sep 2023 3:28 AM GMT
Next Story