Telugu Global
Andhra Pradesh

'విజన్ విశాఖ'.. ఎల్లో మీడియాకు మరింత కడుపు మంట

విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి సీఎం జగన్ అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓవైపు కోర్టు కేసులు ఉన్నా కూడా రాజధానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

విజన్ విశాఖ.. ఎల్లో మీడియాకు మరింత కడుపు మంట
X

ఏపీ సీఎం జగన్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. విశాఖలోని రాడిసన్‌ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్‌..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. రూ.1500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

రగిలిపోతున్న ఎల్లో మీడియా..

ఇప్పటికే రుషికొండ భవనాల ప్రారంభోత్సవానికి సీఎం జగన్ రాలేదని, వాటి సంగతేంటో చెప్పాలంటూ ఎల్లో మీడియా రగిలిపోతోంది. ఆ ప్రారంభోత్సవాల తర్వాత తొలిసారి సీఎం జగన్ విశాఖకు వస్తున్నారు. ఇటీవల ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వ్యవహారంలో కూడా రచ్చ జరిగింది. విశాఖ విషయంలో ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు లేనిపోని హంగామా చేయడానికి రెడీగా ఉంది. ఈ దశలో సీఎం జగన్ అక్కడకు వస్తుండటం, పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతుండటంతో ఎల్లో మీడియా రగిలిపోతోంది.

విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి సీఎం జగన్ అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓవైపు కోర్టు కేసులు ఉన్నా కూడా పాలనా రాజధానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖను ఉపాధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక సదస్సులన్నిటికీ విశాఖను వేదికగా చేసుకుంటున్నారు. తాజాగా ‘విజన్‌.. విశాఖ’ సదస్సులో 2 వేల మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సీఎం జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. ఎన్నికల వేళ విశాఖ నుంచి సీఎం కీలక ప్రకటనలు ఏమైనా చేస్తారేమో చూడాలి.

First Published:  5 March 2024 3:00 AM GMT
Next Story