ఫ్లెక్సీ తయారీదారులకు 20లక్షల రుణం- జగన్ ఆదేశం
కొత్త మార్పుల నేపథ్యంలో ఫ్లెక్సీల తయారీదారులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తించిన సీఎం జగన్.. ఫ్లెక్సీల తయారీదారులకు పావల వడ్డీతో 20 లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో పర్యావరణ పరిరక్షణ కోసం కొన్నిరోజుల క్రితం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్టు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నవంబర్ 1 నుంచి నిషేధం అమలులోకి వస్తుందని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉపాధిపై తక్షణ తీవ్ర ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. ఇంత త్వరగా నిషేధం అమలులోకి వస్తే తాము దెబ్బతింటామని ఫ్లెక్సీల తయారీదారులు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి, తయారీ పరికరాలు మార్చుకోవడానికి టైం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ నిషేధం అమలును జవనరి 26కు వాయిదా వేయించారు. ఆలోపు ప్లాస్టికేతర ఫ్లెక్సీల తయారీకి సిద్ధపడాలని సూచించారు. కొత్త మార్పుల నేపథ్యంలో ఫ్లెక్సీల తయారీదారులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తించిన సీఎం జగన్.. ఫ్లెక్సీల తయారీదారులకు పావల వడ్డీతో 20 లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సొమ్మును నూతన పరిజ్ఞానం, కొత్త సామగ్రి కొనుగోలు వంటి వాటి కోసం వాడుకోవచ్చు.