Telugu Global
Andhra Pradesh

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం -జగన్

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. సెప్టెంబర్ నుంచి అన్ని కార్యకలాపాలు విశాఖనుంచే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు.

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం -జగన్
X

ఏపీ రాజకీయాలన్నీ వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో సడన్ గా కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. సెప్టెంబర్ నుంచి పాలన విశాఖపట్నం నుంచి కొనసాగుతుందన్నారు. తాను కూడా విశాఖలోనే ఉంటానని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖను పాలనా రాజధాని చేశామని, ఇక అక్కడినుంచే పాలన మొదలవుతుందని చెప్పారు. సెప్టెంబర్ నుంచి అన్ని కార్యకలాపాలు విశాఖనుంచే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.

శ్రీకాకుళం జిల్లాలో మూలపేట గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం, హిర మండలంలో వంశధార లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జగన్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం మారిపోతుందన్నారు జగన్. గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని, ఇకపై మూలపేట.. అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.


రెండేళ్లలో పోర్ట్ నిర్మాణం పూర్తి..

మూలపేట పోర్ట్ రెండేళ్లలో పూర్తవుతుందని చెప్పారు సీఎం జగన్. భవిష్యత్‌ లో మూలపేట, విష్ణు చక్రం ప్రాంతాలు.. ముంబై, మద్రాస్‌ లాగా మారిపోతాయని చెప్పారు. పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా 35వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పోర్టులు మాత్రమే ఉన్నాయని, వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టామని చెప్పారు జగన్.

First Published:  19 April 2023 7:08 AM GMT
Next Story