Telugu Global
Andhra Pradesh

చిన్నారి వైద్యం కోసం సీఎం జ‌గ‌న్ రూ.కోటి మంజూరు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటోందని వెల్లడించారు. నెలకు రూ.10 వేలపెన్షన్ కూడా మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

చిన్నారి వైద్యం కోసం సీఎం జ‌గ‌న్ రూ.కోటి మంజూరు
X

అరుదైన గాకర్స్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ పెద్ద మనసుతో స్పందించారు. ఏకంగా రూ.కోటి రూపాయల బడ్జెట్‌ను కేటాయించారు. దీంట్లో భాగంగా అత్యంత ఖరీదైన 13 ఇంజక్షన్లను బి.ఆర్‌.అంబేద్కర్‌ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదివారం అంద‌జేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటోందని వెల్లడించారు. నెలకు రూ.10 వేలపెన్షన్ కూడా మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వ‌రానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి బాలిక హనీకి పుట్టుకతోనే గాకర్స్ వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వల్ల కాలేయం పనిచేయదు. ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో సీఎం పర్యటించారు. తిరుగు ప్రయాణంలో హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును సీఎం చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు. తన వెంట హెలిప్యాడ్‌ వద్దకు తీసుకురావాలని అక్కడున్న భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అక్క‌డ‌ ఏర్పాటు చేసిన శిబిరంలో హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి సీఎం ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను సీఎం ఆదేశించారు. దీని కోసం ప్రతిపాదనలను వెంటనే పంపాలని సూచించారు

కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరు చేసింది. హనీ వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్‌ వెల్లడించారు. ఆదివారం రోజు అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్నారి హనీకి ఇంజక్షన్లను కలెక్టర్ అంద‌జేశారు. గాకర్స్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసిందని, ప్రస్తుతం 13 ఇంజక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపిన‌ట్లు తెలిపారు. ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 కాగా, ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్‌ను, క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వనున్నారు.

అలాగే పాప ఎడ్యుకేషన్ పరంగా కూడా సీఎం జ‌గ‌న్‌ స్పందించి.. ఉదారంగా సహకారం అందించారని కలెక్టర్‌ తెలిపారు. పింఛన్ ఇప్పించేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని, దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు 14 మంది ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి వైద్యం అందించలేదని, తొలుతగా స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ తరహా వ్యాధి నివారణ చర్యలు ఆరంభమయ్యాయన్నారు.

పాప తండ్రి కొప్పాడ రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవగానే ఎంతో ఉదారంగా స్పందించి ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ప్రభుత్వపరంగా ఆదుకుంటానని భరోసా కల్పించారన్నారు. భరోసా ఇచ్చిన రెండు నెలల్లో వైద్య సేవలు ఆరంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నారి తల్లి నాగలక్ష్మి మాట్లాడుతూ.. ఇటువంటి వ్యాధి ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు. తమది పేద కుటుంబమని వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత లేదని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని అండగా నిలవడంతో చిన్నారి హనీ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ 13 ఇంజక్షన్లు అందజేశారు.

First Published:  2 Oct 2022 1:18 PM GMT
Next Story