Telugu Global
Andhra Pradesh

చిన్నారికి సీఎం జగన్ పెన్ను గిఫ్ట్.. దాని ఖరీదెంతో తెలుసా?

సీఎం జగన్ తన పెన్నును బాలుడికి ఇవ్వడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

YS Jagan gifts his pen
X

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. చాలా సేపు నడుస్తూనే ఆయా లంక గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

పెదపూడి లంకల వరద బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడుతూనే.. ఒక చిన్నారిని ఎత్తుకున్నారు. బాధితులతో ఆయన మాట్లాడుతుండగా.. బాలుడు మాత్రం అమాయకంగా జగన్ జేబులో నుంచి పెన్ను తీసుకున్నాడు. పెన్నుపై పట్టు సరిగా లేక కింద పడిపోయింది. దీంతో చుట్టు పక్కన ఉన్న వాళ్లు సీఎం పెన్ను పడిపోయిందంటూ హడావిడి చేశారు. అయితే వైఎస్ జగన్ మాత్రం ఆ బాబుతో మాట్లాడుతూ.. 'పెన్ను కావాల్నా నీకు. ఇదిగో తీసుకో' అంటూ ఆ పెన్‌ను బాలుడి చేతిలో పెట్టారు. ఆ వెంటనే ఆ బాలుడు పెన్నును నోట్లో పెట్టుకొని తన ఆట తాను ఆడుకున్నాడు. బాలుడి తల్లి సీఎంకు విజ్ఞాపన పత్రం ఇస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకున్నది. సీఎం జగన్ తన పెన్నును బాలుడికి ఇవ్వడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

కాగా, జగన్ ఇచ్చిన పెన్ మోంట్‌బ్లాక్ అనే బ్రాండ్‌కు చెందింది. ఆ పెన్ను ఖరీదు రూ. 40 వేల నుంచి రూ. 70 వేల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సీఎం జగన్‌కు మొదటి నుంచి మోంట్‌బ్లాక్ కంపెనీ పెన్నులంటే మక్కువని.. తాను ఎక్కడకు వెళ్లినా ఆ పెన్ను జేబులో ఉండాల్సిందే అని చెప్తారు. అందుకే జగన్ పక్కన ఉన్న సెక్యూరిటీ.. పెన్ను తీయకు, పెన్ను తీయకు అని బాలుడిని సున్నితంగా వారించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ, జగన్ మాత్రం వాటిని ఏమీ పట్టించుకోకుండా బాలుడికి పెన్ గిఫ్ట్‌గా ఇచ్చారని అంటున్నారు. సీఎం ఇచ్చిన పెన్ను మాకు ఎంతో అపురూపం అని ఆ తర్వాత బాలుడి తల్లి వ్యాఖ్యానించడం గమనార్హం.

First Published:  26 July 2022 12:28 PM GMT
Next Story