Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు మెడకు ఉచ్చు.. మద్యం స్కామ్‌లో కోట్లు స్వాహా

మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్‌ ఫీజును తొలగించడమే కాకుండా చంద్రబాబు అండ్‌ కో అడ్డగోలుగా కథ నడిపినట్లు బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వం చీకటి జీవోలతో తనకు అనుకూలమైన కంపెనీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

చంద్రబాబు మెడకు ఉచ్చు.. మద్యం స్కామ్‌లో కోట్లు స్వాహా
X

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మెడకు మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు తన ప్రభుత్వ హయంలో మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు మింగిన విషయం వెలుగు చూసింది. చంద్రబాబు అండ్‌ కో ఏటా రూ.1300 కోట్లు దోచుకున్నట్లు కాగ్‌ నివేదికతో వెలుగులోకి వ‌చ్చింది. దీంతో మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ ఏఐఎస్‌ నరేష్‌, తదితరులు నిందితులుగా ఉన్నారు.

మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్‌ ఫీజును తొలగించడమే కాకుండా చంద్రబాబు అండ్‌ కో అడ్డగోలుగా కథ నడిపినట్లు బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వం చీకటి జీవోలతో తనకు అనుకూలమైన కంపెనీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విష‌యంలో సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది. కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన వైనంపై ఆధారాలు సేకరించింది. దాంతో ఈ స్కామ్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి వారిని విచారించాలని సిఐడి నిర్ణయించింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే చంద్రబాబు, కొల్లు రవీంద్ర, నరేష్‌, తదితరులపై సిఐడి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

నోట్‌ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టు రట్టు

మద్యం కొనుగోళ్లపై 2012 నుంచి ప్రివిలేజ్‌ ఫీజు ఉంది. అయితే, ప్రభుత్వం ఆ ప్రివిలేజ్‌ ఫీజు తొలగించి చంద్రబాబుకు అనుకూలమైన కంపెనీలకు మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టింది. అందుకు పకడ్బందీ పథకం అమలైంది. ప్రివిలేజ్‌ ఫీజును కొనసాగించడంతో పాటు దాన్ని 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్‌ కమిషర్‌ నోట్‌ ఫైల్‌ పంపించారు. దానిపై మంత్రివర్గం చర్చ కూడా చేయలేదు. కానీ, మంత్రివర్గ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్‌ కమిషర్‌ ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేయాలనే ప్రతిపాదనతో మరో నోట్‌ ఫైల్‌ పంపించారు. కాపీ టు పీఎస్‌ టు సీఎం అని అందులో స్పష్టం పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం డిస్టిలరీలకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తూ 2015 జూన్‌ 22వ తేదీన 218 నెంబర్‌ జీవోను రహస్యంగా జారీ చేసింది. బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్‌ 1వ తేదీన సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబర్‌ 9వ తేదీన వినతిపత్రం సమర్పించినట్లు చూపించారు. బార్ల యజమానుల సంఘం వినతిపత్రం రాక ముందే ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాడాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అంటే, ఎంత బరితెగించి చంద్రబాబు ఈ చర్యకు పాల్పడ్డారనేది అర్థం చేసుకోసుకోవచ్చు. ఆ తర్వాత బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తూ 2015 డిసెంబర్‌ 11వ తేదీన 468 నెంబర్‌ జీవో జారీ అయింది.

దానికి సంబంధించిన నోట్‌ ఫైళ్లపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్‌ 3వ తేదీన సంతకం చేయగా, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్‌ 4వ తేదీన డిజిటల్‌ సైన్‌ చేశారు. మరో వైపు డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు ఇవ్వడమే కాకుండా అప్పటి వరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి పడిందని కాగ్‌ తేల్చింది.

ఇక నిందితుల విచారణే తరువాయి..

మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సిఐడి అందులో పాత్రధారులను, సూత్రధారులను విచారించాలని నిర్ణయించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధమైన నోట్‌ ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసిన తర్వాత బార్ల యజమానుల సంఘం సమర్పించిన వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చడం వంటి అంశాలపై కీలక ఆధారాలు సేకరించింది. న్యాయనిపుణుల సలహా తీసుకుని ప్రశ్నావళిని తయారు చేయడమే కాకుండా కేసులో నిందితులను విచారించడానికి సిద్దమైంది.

First Published:  3 Feb 2024 9:29 AM GMT
Next Story