Telugu Global
Andhra Pradesh

గుండు కొట్టలేదు, రేప్ జరగలేదు..

ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లి కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని భవ్యశ్రీ తల్లిదండ్రులు అంటున్నారు. వారు చెప్పిన ప్రకారం ఆ ముగ్గుర్ని పోలీసులు విచారించినా ఫలితం లేదు.

గుండు కొట్టలేదు, రేప్ జరగలేదు..
X

జస్టిస్ ఫర్ భవ్యశ్రీ.. ప్రస్తుతం ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ ఇది. చిత్తూరు జిల్లా వేణుగోపాల పురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ దారుణ హత్యకు గురైంది. ఆమె ఈనెల 17న మిస్సైనట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈనెల 20న ఆమె ఊరి చివర బావి వద్ద శవమై కనిపించింది. హంతకులను ఇంకా పోలీసులు గుర్తించలేదు. అనుమానితులంటూ భవ్యశ్రీ తల్లిదండ్రులు చెప్పిన యువకులను పోలీసులు విచారించారు కానీ ఫలితం లేదు. అసలు భవ్యశ్రీని చంపిందెవరనేది తేలలేదు. దీనికి తోడు ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమెకి గుండు కొట్టించారని, కళ్లు పీకేశారంటూ వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే చిత్తూరు జిల్లా పోలీసులు ఈ వార్తల్ని ఖండించారు.


"పెనమలూరు మండలంలో సంచలనం రేపిన 16 సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పద మృతి విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిపై అత్యాచారం జరగలేదు. శరీరంపై గాయాలు కూడా లేవు, ఆ అమ్మాయికి గుండు కొట్టించి చంపారన్నది అవాస్తవం. ఆమె తలనుంచి ఊడిపోయిన జుట్టు బావిలో దొరికింది. అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల్ని విచారిస్తున్నాం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం." అంటూ చిత్తూరు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎందుకీ తప్పుడు ప్రచారం..?

ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లి కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని భవ్యశ్రీ తల్లిదండ్రులు అంటున్నారు. వారు చెప్పిన ప్రకారం ఆ ముగ్గుర్ని పోలీసులు విచారించినా ఫలితం లేదు. అందులోనూ ప్రేమ అంటూ వెంటపడే పిల్లలు అంత దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేస్తారని ఊహించలేం. గుండు కొట్టించడం, కళ్లు పీకేయడం అన్నీ అసత్య ప్రచారాలేనంటున్నారు పోలీసులు. ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసింది ఆ ముగ్గురు కాకపోతే, ఇంకెవరు అనేది తేలాల్సి ఉంది. తెలిసినవారి పనేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.

First Published:  26 Sep 2023 7:35 AM GMT
Next Story