Telugu Global
Andhra Pradesh

ఆ పేపర్, ఆ టీవీ.. టీడీపీ రివర్స్ ఎటాక్

కోనసీమ జిల్లా పర్యటనలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. గతంలో వైసీపీ నేతలు విసిరిన ఛాలెంజ్ ని తిరిగి వారికే అన్వయిస్తున్నారు. గడప గడపకు వెళ్దాం.. సీఎం జగన్ తనతో వస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు.

ఆ పేపర్, ఆ టీవీ.. టీడీపీ రివర్స్ ఎటాక్
X

దుష్టచతుష్టయం అంటూ చంద్రబాబుతో కలిపి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5పై విమర్శలు చేస్తుంటారు వైసీపీ నేతలు. టీడీపీకి అనుకూలంగా ఆ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని, వైసీపీకి ప్రజలే మీడియా అని చెబుతుంటారు సీఎం జగన్. ఇన్నాళ్లూ ఈ విషయంలో టీడీపీ రివర్స్ ఎటాక్ మొదలు పెట్టలేదు. తనకు ఏ మీడియా సపోర్ట్ లేదని జగన్ చెబుతున్నా.. ఎందుకో సాక్షి విషయంలో టీడీపీ సైలెంట్ గానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు కూడా వ్యూహం మార్చినట్టున్నారు. సాక్షి ఎవరిది బాబూ..? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

సీఎం జగన్ తనకు పేపర్, టీవీ లేవంటున్నారని.. మరి సాక్షి పేపర్, సాక్షి టీవీ ఎవరివి అని ప్రశ్నించారు చంద్రబాబు. సాక్షి పేపర్లో, టీవీలో వైఎస్ఆర్ బొమ్మ వేసుకుంటారు కదా అని లాజిక్ తీశారు. అవి జగన్ వి కావా అన్నారు. తమకి మీడియా సపోర్ట్ ఉందని రచ్చ చేసే జగన్, సాక్షి మీడియాని చూసుకుని రెచ్చిపోతున్నారంటూ సెటైర్లు పేల్చారు. పదే పదే బటన్‌ నొక్కి ప్రజలకు డబ్బులిస్తున్నాని చెప్పే జగన్, బటన్ నొక్కిన ప్రతిసారీ సాక్షికి ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తుంటారని చెప్పారు చంద్రబాబు. డబుల్ ఇన్ కమ్ తో కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారని మండిపడ్డారు.

కోనసీమ జిల్లా పర్యటనలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. గతంలో వైసీపీ నేతలు విసిరిన ఛాలెంజ్ ని తిరిగి వారికే అన్వయిస్తున్నారు. గడప గడపకు వెళ్దాం సీఎం జగన్ తనతో వస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రతి గడపకు కలిసి తిరిగితే.. ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. అలా తిరిగే ధైర్యం లేకే.. పరదాల మాటున పర్యటనలు చేసి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, చేనేతలకోసం ప్రత్యేక పాలసీలు రూపొందిస్తామన్నారు. సీఎం జగన్ కి దమ్ముంటే ప్రజల్లో తిరగాలని సవాల్ విసిరారు చంద్రబాబు.

First Published:  17 Aug 2023 12:36 AM GMT
Next Story