Telugu Global
Andhra Pradesh

వెలిగొండపై చంద్రబాబు మాట నీటిమూట: జగన్‌ నడుం బిగించి..

రెండో టన్నెల్‌ మిగిలిన పనులను రద్దు చేశారు. వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. గత చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిన ధరల కన్నా రూ.62 కోట్లకు తక్కువకు దాన్ని పూర్తి చేయడానికి మెఘా సంస్థ ముందుకు వచ్చింది.

వెలిగొండపై చంద్రబాబు మాట నీటిమూట: జగన్‌ నడుం బిగించి..
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు జిల్లాల నీటి అవసరాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టుపై అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు కల్లబొల్లి కబుర్లే చెప్పారు. ఆయన ఇచ్చిన హామీ నీటి మూటనే అయింది. ముఖ్యమంత్రిగా 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును రూ.1,415 కోట్లు ఖర్చు చేసి 2017 వరకు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ వంటి కాంట్రాక్టర్లకు 2వ టన్నెల్‌ పనులు అప్పజెప్పారు. దానిపై రూ.650 కోట్లు ఖర్చు చేశారు. అయినా అది పూర్తి కాలేదు.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రమేష్‌కు కట్టబెట్టిన రెండో టన్నెల్‌ మిగిలిన పనులను రద్దు చేశారు. వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. గత చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిన ధరల కన్నా రూ.62 కోట్లకు తక్కువకు దాన్ని పూర్తి చేయడానికి మెఘా సంస్థ ముందుకు వచ్చింది. దాంతో మెఘా సంస్థకు 7.7 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. అది పూర్తయింది. దానిపై జగన్‌ ఇప్పటి వరకు రూ.1,046 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు తన సొంత మనుషులకు కాంట్రాక్టు కట్టబెట్టి పూర్తి చేయలేని వెలిగొండ టన్నెల్‌ పనిని వైఎస్‌ జగన్‌ పూర్తి చేయించారు. వెలిగొండ రెండో టన్నెల్‌ పని ఇటీవల పూర్తయింది. తద్వారా జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెర‌వేర్చారు.

2019 మే 30వ తేదీనాటికి మొదటి టన్నెల్‌ తవ్వకం 7.698 కిలోమీటర్ల మేర పూర్తి అయింది. మొదటి సొరంగం మిగతా పనులు 2021 జనవరి 13వ తేదీకి పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సొరంగాలు ఇవి. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలోనే పూర్తయింది.

ప్రకాశం, నెల్లూరు, కడప వైఎస్సార్‌ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. అంతేకాకుండా మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మందికి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.

ప్రకాశం జిల్లా కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు రెండో టన్నెల్‌ పనులు చేపట్టారు. మొదటి సొరంగం ఏడు డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వితే, రెండో టన్నెల్‌ 9.2 డయా మీటర్ల వ్యాసార్థంతో తవ్వారు. తొలి టన్నెల్‌ నుంచి 3 వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్‌ 8500 క్యూసెక్కుల చొప్పున రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేందుకు వీటిని నిర్మించారు.

First Published:  24 Jan 2024 9:17 AM GMT
Next Story