Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు భ్రమరావతి: రాజధాని అలా కుదరదని చెప్పినా..

లక్షా 9వేల కోట్ల అంచనా వ్యయంతో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దాని కోసం ఖర్చు చేసింది కేవలం 9,165 కోట్ల రూపాయలు మాత్రమే.

చంద్రబాబు భ్రమరావతి: రాజధాని అలా కుదరదని చెప్పినా..
X

తాము అధికారంలోకి వస్తే అమరావతిని నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అసలు అమరావతి అనేది ఒక భ్రమ మాత్రమేనని వాస్తవ పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. అమరావతిని నిర్మించడం అసలు సాధ్యమవుతుందా అనేది జవాబు దొరకని ప్రశ్న. అసలు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నిర్ణయించి, దానికి శ్రీకారం చుట్టడం వెనక చంద్రబాబు ఆంతర్యం ఏమిటనేది ఇప్పటికే చాలా వరకు ప్రజలకు తెలిసిపోయింది. శివరామకృష్ణన్‌ కమిటీ హెచ్చరికలను ఆయన స్వార్థ ప్రయోజనాలకు వీలుగా వాడుకున్నారు. శివరామకృష్ణన్‌ ఏ అనర్థాలైతే జరుగుతాయని హెచ్చరించారో, ఆ అనర్థాల కోసమే ఆయన అమరావతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తను, తన వర్గం ప్రయోజనాల కోసం భారీ ప్రాజెక్టుకు తెరతీశారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన 33 వేల ఎకరాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏడాది పొడవునా పంటలు పండే భూములతో పాటు సాగు భూములు కూడా వీటిలో ఉన్నాయి. 2013 భూసేకరణ, పునరావాసం, రిసెటిల్‌మెంట్‌ చట్టం ప్రకారం 70 కుటుంబాలు అంగీకరిస్తేనే భూములను స్వాధీనం చేసుకోవడానికి వీలుంటుంది. అయితే, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని ప్రజలు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. అయినా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దానికన్నా ముఖ్యంగా మనం గ్రహించాల్సిందేమిటంటే.. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడానికి ముందే చంద్రబాబు సన్నిహితులు, టిడిపి నాయకులు ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. అమరావతి ప్రాంతంలో తాను భూమి కొనుగోలు చేసినట్లు టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వయంగా చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు ఆరోపణలున్నాయి. 4,070 ఎకరాల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై కేసులు కూడా నడుస్తున్నాయి.

ఒక రాష్ట్రానికి అంత సువిశాలమైన రాజధాని అవసరమా, దానికి అంత ఖర్చు అవసరమా అనే ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షా 9వేల కోట్ల అంచనా వ్యయంతో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దాని కోసం ఖర్చు చేసింది కేవలం 9,165 కోట్ల రూపాయలు మాత్రమే. మరో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఎప్పటికప్పుడు నిర్మాణ వ్యయం కూడా పెరుగుతూ వుంటుంది. అమరావతి ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక నిర్మాణాల పరిస్థితి ఏమిటో అనుభవంలోకి వచ్చిందే. వర్షానికి కూడా తట్టుకోలేని పరిస్థితి ఉన్నాయి.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ హైదరాబాద్‌ను కోల్పోయింది.. అత్యధిక రెవెన్యూను సాధించి పెట్టే హైదరాబాద్‌ను కోల్పోయిన తర్వాత సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఆర్థిక వనరులను సమీకరించుకుని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. విభజన వల్ల ప్రజలపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మరిచిపోయి చంద్రబాబు అమరావతిపై దృష్టి పెట్టారు. కేవలం రాష్ట్రం కోసం దాన్ని చేపట్టారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ, తనకూ, తనవారికి వ్యక్తిగత మేలు జరగడానికి మాత్రమే అంత భారీ ప్రాజెక్టును చేపట్టారని అనుకోక తప్పదు. ఐదేళ్ల తన పాలనలో అమరావతి కోసం రూపొందింంచిన డిజైన్లు నాసిరకంగా ఉన్నాయి. డిజైన్ల రూపకల్పనకు ఆయన ముగ్గురు ఆర్కిటెక్టులను మార్చారు. వారికి వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.

రాష్ట్ర విభజనకు సంబంధించిన 2014లోని సెక్షన్ 5, 6లను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని కోసం శివరామకృష్ణన్‌ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ రాజధాని విషయంలో నిర్దిష్టమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా, ఆ కమిటీ సూచనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల దృష్టా అతి పెద్ద రాజధాని సరికాదని శివరామకృష్ణన్‌ కమిటీ సూచించింది. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని కూడా చెప్పింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా గోవా కన్నా పెద్దదని, ఇంత పెద్ద నగరాన్ని నిర్మించి పట్టణీకరణ చేసి హైదరాబాద్‌కు మాదిరిగా రింగ్‌ రోడ్డు నిర్మించడం సరికాదని కూడా చెప్పింది. దానికి తోడు, ఆ ప్రాంతంలో అత్యత్తమ సాగుభూములున్నాయని, చిన్న కమతాలు చాలా ఉన్నాయని, రైతుకూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అందువల్ల ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం సరికాదని చెప్పింది.

శివరామకృష్ణన్‌ కమిటీ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఒకటి చేసింది. అంత పెద్ద రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం వల్ల కృత్రిమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరుగుతుందనేది ఆ హెచ్చరిక. నిజానికి, చంద్రబాబు నాయుడు ఈ కృత్రిమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ఆశించే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారనేది నిస్సందేహం. ఈ కృత్రిమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా తనకు, తనవారికి ప్రయోజనం చేకూరే విధంగా ఆయన వ్యవహరించారు.

రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని, ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ, సచివాలయం ఉన్న చోటనే హైకోర్టు ఉండాలని ఏమీ లేదని, హైకోర్టును ఒక చోట పెట్టి మరో చోట బెంచీ పెట్టాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అధికార వ్యవస్థలు ఉండేలా చూడాలని శివరామకృష్ణన్‌ కమిటీ సూచించింది. ఈ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూచనలను అమలు చేయడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పూనుకుంది. జగన్‌ ప్రభుత్వ చర్యలకు టిడిపి అడ్డుపడుతూ వస్తున్నది.

శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలు ఇవీ..

  • ఏపీలో ఏకైన అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు.
  • రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
  • ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.
  • విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
  • అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు.
  • హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్‌ ఏర్పాటు చేయవచ్చు.
  • ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి.
  • రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి.
  • ముఖ్యంగా (గుంటూరు-విజయవాడ మధ్య) సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి.
  • విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది. ఈ ప్రాంతం భూకంప క్షేత్రం. అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.
  • అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సమాగ్రాభివృద్ధికి విధివిధానాలను రూపొందించాలి.

శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలను పరిశీలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఎంత అనర్థదాయకమైన, అనుచితమైన నిర్ణయం తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు అమరావతి పేర చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే ఆయన అమరావతి పేర మరింత మోసం చేస్తారనే విషయాన్ని గమనించాలి. తమకు మేలు జరిగే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పది లక్షల మంది కోసం (అదీ ఒక సామాజికవర్గానికి చెందినవారి కోసం) అంత పెద్ద రాజధాని నిర్మించినప్పుడు రాష్ట్రానికి చెందిన ఐదు కోట్ల ప్రజల పరిస్థితి ఏమిటనేది అసలు ప్రశ్న.

First Published:  23 Jan 2024 4:21 PM GMT
Next Story