Telugu Global
Andhra Pradesh

విజన్ 2029.. ఒక్క ఛాన్స్ అంటున్న చంద్రబాబు

ఎక్కడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయా..? అని ప్రశ్నించారు చంద్రబాబు. యర్రగొండపాలెంలోని చెత్త.. కొండెపిలో బంగారం అవుతుందా..? అని అడిగారు.

విజన్ 2029.. ఒక్క ఛాన్స్ అంటున్న చంద్రబాబు
X

అప్పట్లో విజన్ 2020 అంటూ చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ విజన్ ఫెయిలై 2019 ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు కొత్తగా విజన్ 2029 అంటూ ఆయన జనాల్లోకి వస్తున్నారు. 2029నాటికి ఏపీని నెంబర్-1 రాష్ట్రంగా చేస్తానని, తనకు మరో అవకాశం ఇవ్వాలని బహిరంగ సభల్లో చెబుతున్నారాయన. తన అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తానని ఒక్క ఛాన్స్ ఇవ్వండని కనిగిరి సభలో అభ్యర్థించారు చంద్రబాబు.

‘రా కదలి రా’ అంటూ చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లానుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. కనిగిరి బహిరంగ సభలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంపై నిందలు వేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు చంద్రబాబు. ప్రజలకు ఇచ్చేది పది రూపాయలని, జగన్ దోచుకునేది 100 రూపాయలని విమర్శించారు. సుపరిపాలన అంటే ప్రజల ఖర్చులు తగ్గించి, వారి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంచడం అని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా సుపరిపాలన లేదన్నారు.

యర్రగొండపాలెంలోని చెత్త.. కొండెపిలో బంగారం అవుతుందా..?

ఎక్కడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయా..? అని ప్రశ్నించారు చంద్రబాబు. యర్రగొండపాలెంలోని చెత్త.. కొండెపిలో బంగారం అవుతుందా..? అని అడిగారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని అన్నారు చంద్రబాబు. తన హయాంలో ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్‌ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారని ఎద్దేవా చేశారు. తాను, పవన్‌ కల్యాణ్‌ మాత్రమే కాదని.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత అని ప్రజలకు ఉపదేశించారు చంద్రబాబు.

First Published:  5 Jan 2024 2:38 PM GMT
Next Story