Telugu Global
Andhra Pradesh

నోటీసులపై మౌనమేల బాబూ..! వైసీపీ ర్యాగింగ్

ఎన్టీఆర్‌ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోందని, చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలన్నారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్, ముందు తన తండ్రి అవినీతి బాగోతంపై స్పందించాలన్నారు పేర్ని నాని.

నోటీసులపై మౌనమేల బాబూ..! వైసీపీ ర్యాగింగ్
X

చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారం ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. టీడీపీ అనుకూల మీడియా కూడా నోటీసుల వ్యవహారాన్ని హైలైట్ చేయలేదు. చంద్రబాబు అండ్ టీమ్ పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించింది. టీడీపీ నుంచి కనీసం సింపతీకి కూడా రియాక్షన్లు లేవు. దీంతో సహజంగానే వైసీపీ నుంచి ర్యాగింగ్ మొదలైంది. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి అమర్నాథ్ చంద్రబాబుకి కౌంటర్లిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు.

ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు పేర్ని నాని. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా? అని అడిగారు. చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టిందని, ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేశారనేది బహిర్గతమైందని అన్నారు. ఎన్టీఆర్‌ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోందని, చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలన్నారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్, ముందు తన తండ్రి అవినీతి బాగోతంపై స్పందించాలన్నారు పేర్ని నాని. ఒకవేళ ఆ ఆరోపణలు తప్పు అనుకుంటే హిందుస్తాన్‌ టైమ్స్‌ పై దావా వేసే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ప్రజల సొమ్ము అడ్డంగా తినేశారని, మళ్లీ ప్రజల సొమ్ము తినేసేందుకు అధికారం ఇవ్వాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చంద్రబాబు, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారని, అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని ఎద్దేవా చేశారు పేర్ని నాని.

అవినీతికి ప్యాంట్, షర్ట్..

చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అవినీతికి ప్యాంట్, షర్ట్ వేస్తే చంద్రబాబులాగా ఉంటుందన్నారు. చేసిన తప్పులకు శేష జీవితంలో చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదన్నారు. అవినీతి వ్యవహారాల్లో కాపాడమని కేంద్రంలోని పెద్ద కాళ్లు మొక్కడానికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ 100 రూపాయలు నాణెం విడుదల సభలో చంద్రబాబు కూర్చున్న సీటే ఆయన స్థాయిని చెప్పిందన్నారు. హెరిటేజ్ వ్యాపారం కోసం చంద్రబాబు పిండింది ఆవు పాలో గేదే పాలో కాదని, రాష్ట్ర ఖజానాను పిండుకున్నారని, కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల రూపంలో కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్.


First Published:  1 Sep 2023 2:01 PM GMT
Next Story