Telugu Global
Andhra Pradesh

సీనియర్ల మధ్య చిచ్చుపెడుతున్నారా..?

కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలు ప్రముఖమైనవి. రాబోయే ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యామ్, తమ్ముడు కేఈ ప్రభాకర్ పోటీకి రెడీ అవుతున్నారు.

సీనియర్ల మధ్య చిచ్చుపెడుతున్నారా..?
X

రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కొందరు సీనియర్ల మధ్య చిచ్చుపెడుతున్నట్లే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబానికి ఒక టికెట్టే కేటాయిస్తానని గట్టిగా చెబుతున్నారు. అయితే సీనియర్లలో కూడా కొందరికి రెండు టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో సీనియర్ల మధ్యే చంద్రబాబు విభజన తీసుకొచ్చినట్లయ్యింది. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలు ప్రముఖమైనవి. రాబోయే ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యామ్, తమ్ముడు కేఈ ప్రభాకర్ పోటీకి రెడీ అవుతున్నారు.

వీళ్ళతో మాట్లాడినపుడు ఇద్దరిలో ఎవరో ఒకరికే టికెట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ కావాలో తేల్చుకోమని వాళ్ళకే వదిలేశారు. అలాగే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, భార్య సుజాతమ్మ గ‌త‌ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తానని చెప్పేశారు. ఎవరు పోటీచేయాలో తేల్చుకోమని కుటుంబానికే వదిలేశారు. ఇక కడపలో రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి కూడా ఇలాగే చెప్పారు.

కడప ఎంపీగా శ్రీనివాసులరెడ్డి, కడప అసెంబ్లీకి భార్య మాధవీరెడ్డి, రాయచోటి అసెంబ్లీకి తమ్ముడు రమేష్ కుమార్ రెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు. వీళ్ళతో మాట్లాడిపుడు ముగ్గురికి టికెట్లివ్వటం సాధ్యంకాదని చెప్పేశారట. ఎవరు పోటీలో ఉంటారో తేల్చుకోమని ఛాయిస్ వదిలేశారు. ఇదే విధంగా అనంతపురం జిల్లా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో పరిటాల సునీత, కొడుకు పరిటాల శ్రీరామ్ కు కూడా షాకిచ్చారు. ఇద్దరిలో పోటీలో ఎవరుండాలో తేల్చుకుని చెప్పమని చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, కొడుకు చింతకాయల విజయ్ కు కూడా ఇదే షాక్ తగిలిందని పార్టీ వర్గాల టాక్.

అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం అసెంబ్లీకి, విజయ్ అనకాపల్లి ఎంపీగా పోటీకి రెడీ అవుతున్నారు. రెండు టికెట్ల కోసం అయ్యన్న పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఇక కింజరాపు కుటుంబానికి మూడు టికెట్లు ఓకే చేశారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, రామ్మోహన్ చెల్లెలు భవాని పోటీచేసిన విషయం తెలసిందే. ఈ కుటుంబంలో మాత్రం మూడు టికెట్లు ఇస్తున్నట్లు చెప్పారు. దాంతో చాలామంది సీనియర్ల చంద్రబాబుపై మండిపోతున్నారు. తమ కుటుంబాల తక్కువేంటి..? కింజరాపు కుటుంబం ఎక్కువేమిటని అడుగుతున్నారు. నిజానికి కుటుంబానికి రెండు టికెట్లిస్తున్నట్లు మొదట్లో చెప్పిందే చంద్రబాబు. ఇపుడేమో ఒకటే అనేటప్పటికి గొడవలు మొదలవుతున్నాయి. చివరకు ఏమవుతుందో ఏమో.

First Published:  28 Dec 2023 5:36 AM GMT
Next Story