Telugu Global
Andhra Pradesh

కుప్పంకు ఏం చేశానో చెప్పలేను కానీ..!

తనలాంటి వాడినే ఎన్నో సార్లు సీఎం జగన్ ఏడిపించారని కుప్పంలో మహిళల ముందు సింపతీ సీన్ క్రియేట్ చేశారు చంద్రబాబు.

కుప్పంకు ఏం చేశానో చెప్పలేను కానీ..!
X

చంద్రబాబు కుప్పం పర్యటన ఆత్మస్తుతి - పరనిందలా మారింది. కనీసం కుప్పం నియోజకవర్గానికి ఏం చేశాననేది ఆయన చెప్పుకోలేకపోయారు. కుప్పంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఒక్క ముక్కకూడా చెప్పలేదు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉన్నత స్థానంలో ఉంటూ కూడా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని అసమర్థ నేతని తానేనని ఆయన ఒప్పుకున్నట్టయింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వచ్చిన చంద్రబాబు మహిళలతో ముఖాముఖి మాట్లాడారు.



ఆత్మస్తుతి..

మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు చంద్రబాబు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించిన పార్టీ టీడీపీ అని గొప్పలు చెప్పుకున్నారు. డ్వాక్రా సంఘాల ఘనతను మరోసారి తన ఖాతాలో వేసుకున్నారు. ఈసారి అధికారం ఇస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు రూ.1500 మహిళల అకౌంట్లలో జమ చేస్తానన్నారు బాబు. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తానని, దేశంలోనే కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతానని సెలవిచ్చారు. కుప్పంలో తనకు లక్ష మెజార్టీ రావాలంటూ మహిళలకు పెద్ద టార్గెట్ ఫిక్స్ చేశారు బాబు.

నన్నే ఏడిపించారు..

తనలాంటి వాడినే ఎన్నో సార్లు సీఎం జగన్ ఏడిపించారని కుప్పంలో మహిళల ముందు సింపతీ సీన్ క్రియేట్ చేశారు చంద్రబాబు. తన భార్యను అవమానించారని.. మహిళలంటే వైసీపీకి గౌరవం లేదని అన్నారు. కుప్పం ప్రజల ఆశీస్సులు కోసం తాను వచ్చానని, ఇక్కడికు వచ్చిన ప్రతిసారీ ఫుల్ రీచార్జ్ అయి వెళ్తానని చెప్పుకొచ్చారు.

ఓట్ల కోసం వైసీపీ వాళ్ళు డబ్బులతో పాటు గంజాయి, డ్రగ్స్ కూడా ఇస్తారని, వైసీపీకి ఓటు వేస్తే కుటుంబానికి ద్రోహం చేసినట్లేనని చెప్పారు చంద్రబాబు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రానికి రావడానికే భయపడ్డారని, ఇప్పుడు ఏపీలో యథేచ్ఛగా చీకటి వ్యాపారాలు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీపై విమర్శలు సరే కానీ, అసలు కుప్పంకు తాను ఏం చేశానో చెప్పుకునేందుకు చంద్రబాబు దగ్గర మాటలు లేకపోవడం విశేషం.

First Published:  25 March 2024 11:41 AM GMT
Next Story