Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు పది కాలాలపాటు చల్లగా ఉండాలి.. వైసీపీ మంత్రి ఆకాంక్ష

వైసీపీ నుంచి ఓ మంత్రి, చంద్రబాబుపై ఎక్కడలేని ప్రేమ చూపించారు. ఆయన పదికాలాలపాటు చల్లగా ఉండాలన్నారు.

చంద్రబాబు పది కాలాలపాటు చల్లగా ఉండాలి.. వైసీపీ మంత్రి ఆకాంక్ష
X

చంద్రబాబు చచ్చిపోవాలి అంటూ ఆమధ్య వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయనపై టీడీపీ నేతలు పోలీస్ కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత సదరు ఎంపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పుకొచ్చారు. ఆయన చచ్చిపోవడం అంటే, ఆయన పార్టీ ఉనికిలో లేకుండా పోవడం అనేది తన వ్యాఖ్యల నిగూఢార్థం అన్నారు. అయితే ఇప్పుడు అదే వైసీపీ నుంచి ఓ మంత్రి, చంద్రబాబుపై ఎక్కడలేని ప్రేమ చూపించారు. ఆయన పదికాలాలపాటు చల్లగా ఉండాలన్నారు.

చంద్రబాబు బెయిల్ వ్యవహారంపై సెటైర్లు పేల్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఒంట్లో బాలేదు, కంట్లో బాలేదు, చర్మ వ్యాధి వచ్చిందని కోర్టులో చెప్పి చంద్రబాబు బెయిల్ పై బయటకొచ్చారని.. కానీ ఆయన పదికాలాల పాటు చల్లగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. దొంగోడు జైలునుంచి బయటకు వస్తే ఆనందపడాలా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు బయటకొచ్చింది బెయిలుపై మాత్రమేనని, కేసు కొట్టేసినంత సంబరం ఎందుకని టీడీపీ నేతల్ని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చెయటంలో చంద్రబాబు పెద్ద దిట్ట అని, కానీ వైసీపీ మేనేజ్ చేస్తోందంటూ తమపై రివర్స్ లో విమర్శలు చేస్తున్నారని అన్నారు. వ్యవస్థలలోని లొసుగులతో, చట్టాలలోని లోపాలతో వారు తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పారు బొత్స.

ఏం పీకుతారని టీడీపీ నేతలు గతంలో అన్నారని, అవినీతి అన్యాయం చేసి కబుర్లు మాట్లాడితే ఏం జరిగిందో చూశారు కదా అని సెటైర్లు వేశారు మంత్రి బొత్స. సామాన్యులు, పేదలు, రైతుల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. డబ్బులిస్తే ప్రజలు ఓటేస్తారనుకోవడం పొరపాటని, ప్రజలు చాలా తెలివైనవారని పేర్కొన్నారు. గతంలో ఎన్నికలైన నాలుగేళ్ల దాకా పార్టీలు బయట అడుగు బయటపెట్టే పరిస్థితి ఉండేది కాదని.. కానీ జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేల గౌరవం పెరిగిందని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి బొత్స పేర్కొన్నారు.

First Published:  1 Nov 2023 12:49 PM GMT
Next Story