Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు, పవన్ సరికొత్త నినాదం

రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతేనే ప్రజలు గెలిచినట్లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. ఇదే విధంగా వైసీపీ ఓడిపోతేనే రాష్ట్రం గెలిచినట్లని చంద్రబాబు మొదలుపెట్టారు. అసలు ప్రజలు గెలవటం ఏమిటి? రాష్ట్రం గెలవటం ఏమిటి? అన్నదే అర్థంకావటంలేదు.

చంద్రబాబు, పవన్ సరికొత్త నినాదం
X

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఒక పిచ్చి నినాదాన్ని మొదలుపెట్టారు. అదేమిటంటే పవనేమో జనాలు గెలవాలని, చంద్రబాబేమో రాష్ట్రం గెలవాలని. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతేనే ప్రజలు గెలిచినట్లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. ఇదే విధంగా వైసీపీ ఓడిపోతేనే రాష్ట్రం గెలిచినట్లని చంద్రబాబు మొదలుపెట్టారు. అసలు ప్రజలు గెలవటం ఏమిటి? రాష్ట్రం గెలవటం ఏమిటి? అన్నదే అర్థంకావటంలేదు.

ఎన్నికల్లో పోటీ చేసేది రాజకీయ పార్టీలు. పార్టీల తరపున అభ్యర్థులు పోటీచేసి గెలుపోటములను తేల్చుకుంటారు. ఏ పార్టీ అయితే అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఇదంతా ప్రజాస్వామ్య మౌళిక సూత్రం ప్రకారమే జరుగుతుంది. ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏమిటంటే పోలింగ్ నాడు వచ్చి ఓట్లేయటమే. ఓట్లేయటం అన్నది ప్రజల బాధ్యత, హక్కు. అయితే వివిధ కారణాల వల్ల ప్రజలంద‌రూ ఆ హక్కును వినియోగించుకోవటంలేదు.

ఈ విషయాన్ని పక్కనపెడితే వైసీపీ ఓడిపోతేనే ప్రజలు గెలిచినట్లని పవన్ చెప్పటంలో అర్థ‌ముందా? అంటే వైసీపీ మళ్ళీ గెలిస్తే ప్రజలు ఓడిపోయినట్లేనా? తమకు ఓట్లేయకపోతే జనాలు ఓడిపోయినట్లే అని పవన్ చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపుపై నమ్మకంలేదే ఇలా మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబేమో వైసీపీ గెలిస్తే రాష్ట్రం ఓడిపోయినట్లే అంటున్నారు. అంటే చంద్రబాబు, పవన్ ఉద్దేశం ఏమిటంటే ప్రజలు వైసీపీకి ఓట్లేయకుండా ఓడగొట్టాలని. ఒకవైపు ఆ ముక్క చెబుతూనే మళ్ళీ ఈ డొంకతిరుగుడు మాటలెందుకో అర్థ‌కావటంలేదు.

ఎన్నికల్లో ప్రజలు గెలవటం, రాష్ట్రం గెలవటమన్నది ఎక్కడా ఉండదు. పోటీ చేసేది అభ్యర్థులు, గెలిచేది రాజకీయ పార్టీలు మాత్రమే. తాము గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు లేకపోతే ప్రజాస్వామ్యం ఓడినట్లన్నది పిచ్చిమాటలు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మీటింగుల్లో మాట్లాడుతూ టీడీపీని ఓడించిన జనాలను శాపనార్థాలు పెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు ఉద్దేశం ఏమిటంటే టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే జనాలు తెలివైనవాళ్ళు, సరైన తీర్పిచ్చినట్లు. అదే టీడీపీని ఓడగొడితే మాత్రం జనాలు తప్పు చేసినట్లు.

First Published:  30 Jun 2023 5:34 AM GMT
Next Story