Telugu Global
Andhra Pradesh

బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు అందరు కలిసి సత్యకుమార్‌ను స్పాన్సర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ ఎలా ఊపు తెచ్చారో ఏపీలో అలాంటి ఊపు సత్యకుమార్ వల్లే వస్తుందని పదేపదే అగ్రనేతలతో చెబుతున్నారట.

బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్?
X

తొందరలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పార్టీలో ప్రత్యేకించి ఆయనకంటు ఎలాంటి పట్టులేదు. పార్టీలోనే సత్యకుమార్‌కు పట్టులేదంటే ఇక మామూలు జనాల్లో ఏముంటుంది? అయినా సత్యకుమార్‌కు పగ్గాలు అప్పగించాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తుండటమే అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది. సత్యకుమార్‌కు ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అంటే నిలువెత్తు వ్యతిరేకతే.

ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు జగన్ పైన ఒంటికాలిపై లేవటంలేదు. అలాగని మద్దతుగా కూడా మాట్లాడటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. విధానపరమైన వ్యతిరేకతే కానీ వ్యక్తిగత వ్యతిరేకత ఏమీలేదని అర్థమవుతోంది. కానీ సత్యకుమార్ అలాకాదు. జగన్ అంటే నిలువెత్తు వ్యతిరేకతతో ఊగిపోతుంటారు. రెగ్యులర్‌గా ఎల్లో మీడియాలో రాసే ఆర్టికల్స్ లోను, రాష్ట్రంలో పర్యటించినపుడు మాట్లాడే మాటల్లోను ఈ విషయం తెలిసిపోతుంది.

ఒకవిధంగా చెప్పాలంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా వేవ్ లెంగ్త్ కు సత్యకుమార్ సరిగ్గా సరిపోతారు. జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్‌తో ఉంటారనే కారణంగానే వీర్రాజుపై ఎల్లో మీడియా మండిపోతు పదేపదే టార్గెట్ చేస్తోంది. వీర్రాజుకు కూడా ఎల్లోమీడియా, చంద్రబాబును అంతే స్థాయిలో రివర్సులో వాయించేస్తున్నారు. ఇదంతా బీజేపీలోని కొందరికి ఏమాత్రం మింగుడుపడటంలేదట. అందుకనే అందరు కూర్చుని వీర్రాజును తప్పించి సత్యకుమార్‌కు పగ్గాలు అప్పగించేలా అగ్రనేతలపై బాగా ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీలోనే టాక్ నడుస్తోంది.

తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ ఎలా ఊపు తెచ్చారో ఏపీలో అలాంటి ఊపు సత్యకుమార్ వల్లే వస్తుందని పదేపదే అగ్రనేతలతో చెబుతున్నారట. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు అందరు కలిసి సత్యకుమార్‌ను స్పాన్సర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరిని నియమించినా రాష్ట్ర బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే బీజేపీని దెబ్బకొట్టిందే నరేంద్ర మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు, ప్రయోజనాలను తుంగలో తొక్కేసిన కారణంగా జనాలంతా మండిపోతున్నారు. ఒకవైపు చేయాల్సిన డ్యామేజ్ చేస్తూ మరోవైపు అధ్యక్షుడిని మార్చినంత మాత్రాన పార్టీకి ఏమిటి ఉపయోగమో అర్థంకావటంలేదు.

First Published:  1 July 2023 7:02 AM GMT
Next Story