Telugu Global
Andhra Pradesh

వంద‌ల‌కోట్ల‌కు లింగ‌మ‌నేని ర‌మేష్ మోసం చేశారు- చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత ఆందోళ‌న

లింగ‌మ‌నేని ర‌మేష్ ఇచ్చిన చెక్కులు బ్యాంక్‍లో వేస్తే చెల్లలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లింగమనేని కావాలనే త‌మ‌ని మోసం చేశార‌ని బీఎస్ రావు ఆరోపించారు.

వంద‌ల‌కోట్ల‌కు లింగ‌మ‌నేని ర‌మేష్ మోసం చేశారు- చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత ఆందోళ‌న
X

ఏపీలో ఇద్ద‌రు బిగ్ షాట్స్ మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఆర్థిక వివాదం ఇన్నాళ్లూ నానుతూ ఇప్పుడు రోడ్డెక్కింది. వారిలో ఒక‌రు చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత‌, మ‌రొక‌రు రియ‌ల్ట‌ర్ లింగ‌మ‌నేని ర‌మేష్‌. ఒక‌రు నిర్మాణ‌రంగంలోనూ, రియ‌ల్ ఎస్టేట్ రంగంలోనూ టిడిపి హ‌యాంలో ఓ వెలుగు వెలిగారు. మ‌రొక‌రు విద్యాసంస్థ‌ల అధిప‌తిగా అంద‌రికీ చిర‌ప‌రితులే. ఈ అగ్ర వ్యాపార‌వేత్త‌ల మ‌ధ్య ఆర్థిక‌బంధం బెడిసి కొట్టిన‌ట్టు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది.

పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ తమను మోసం చేశారని ఆరోపించిన చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజీస్ ఛైర్మన్ బీఎస్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తమ గ్రూపున‌కు సంబంధించిన కాలేజీలను విస్తరించేందుకు లింగమనేని రమేశ్ భూములు, భవనాలు ఇస్తామని ఆశ చూపించార‌ని పేర్కొన్నారు. పెట్టుబడి పేరుతో త‌మ వ‌ద్ద నుంచి భారీగా డిపాజిట్లు సేకరించారంటూ బీఎస్‍రావు ఆరోపించారు. పారిశ్రామిక‌వేత్త‌గా, రియ‌ల్ట‌ర్‌గా లింగమనేని రమేశ్‍ చేస్తున్న ప్రాజెక్టులు చూసి, నమ్మి 2012-13లో రూ.310 కోట్ల వరకూ చైత‌న్య సంస్థ‌ల నుంచి డిపాజిట్లు ఇచ్చామ‌ని వెల్ల‌డించారు. 2016లో ఎంవోయూ రాసిన లింగ‌మ‌నేని ర‌మేష్ త‌మ‌కి భూములు ఇస్తానని హామీ ఇచ్చార‌ని తెలిపారు. 2019లో చెక్స్ ఇచ్చి నగదు తిరిగి ఇచ్చేస్తానని చెప్పార‌ని, దీనికి తాము అంగీక‌రించామ‌ని బీఎస్ రావు చెప్పారు.

లింగ‌మ‌నేని ర‌మేష్ ఇచ్చిన చెక్కులు బ్యాంక్‍లో వేస్తే చెల్లలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లింగమనేని కావాలనే త‌మ‌ని మోసం చేశార‌ని బీఎస్ రావు ఆరోపించారు. లింగమనేని రమేశ్ చేసిన మోసాలపై హైదరాబాద్ సీసీఎస్‍లో ఫిర్యాదు చేశామ‌ని చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజీస్ ఛైర్మన్ బీఎస్ రావు ప్ర‌క‌టించారు.

First Published:  14 Feb 2023 1:42 PM GMT
Next Story