Telugu Global
Andhra Pradesh

ఏపీపై నిధుల వర్షం

పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేసేందుకు అడ్‌హాక్ నిధుల కింద‌ రూ. 12,911 కోట్లను మంజూరు చేసింది. 2013-14 అంచనాలను పక్కనపెట్టి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి ప్రకారం నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించటంతో ఇంత భారీ ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక‌ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.

ఏపీపై నిధుల వర్షం
X

కారణాలు ఏవైనా ఉండచ్చు రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నిధుల వర్షం కురిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేసేందుకు అడ్‌హాక్ నిధుల కింద‌ రూ. 12,911 కోట్లను మంజూరు చేసింది. 2013-14 అంచనాలను పక్కనపెట్టి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి ప్రకారం నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించటంతో ఇంత భారీ ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక‌ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. నిజానికి అడ్‌హాక్ నిధులుగా రూ. 17 వేల కోట్లను విడుదల చేయాలని జగన్ కేంద్రాన్ని కోరారు.

అయితే వివిధ కారణాల వల్ల కేంద్రం అడ్‌హాక్ నిధుల్లో సుమారు రూ. 5 వేల కోట్లకు కోతపెట్టి మిగిలిన నిధులను మంజూరు చేసింది. ఇంత భారీ మొత్తంలో గడచిన తొమ్మిదేళ్ళల్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేయటం ఇదే మొదటిసారి. తాజా డెవలప్‌మెంట్‌తో ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమస్య దాదాపు తీరినట్లే అని అధికారవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మధ్యనే రెవెన్యూ లోటు భర్తీగా రూ.10,411 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

అంటే ఒక నెలరోజుల్లోనే రాష్ట్రానికి కేంద్రం సుమారు రూ. 23 వేల కోట్లు విడుదల చేసింది. ఢిల్లీకి వెళ్ళినపుడల్లా జగన్ ప్రధాన మంత్రిని కలవటం నిధుల మంజూరు చేయాలని పట్టుబట్టడం, ఆర్థిక‌, జలశక్తి మంత్రులతో భేటీ అయి నిధుల కోసం ఒత్తిడి తెచ్చిన కారణంగానే ఇంత మొత్తంలో నిధులు విడుదలయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రాజెక్టును పూర్తి చేయటాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఒకటికి పదిసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన కారణంగా ఇంత భారీ మొత్తంలో నిధులొచ్చాయి. రికార్డు సమయంలో స్పిల్ వే, స్పిల్ వే ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణాలను పూర్తి చేయించారు. చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాన్నికూడా ఇప్పుడు నిర్మించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పుడు మంజూరైన నిధులతో పెండింగ్ బిల్లులు చెల్లించే ఆలోచనలో జగన్ ఉన్నారు. అలాగే జరగబోయే పనులకు కూడా అవసరమైన నిధులు చేతిలో ఉంటాయి. అలాగే చెల్లింపులు అయిపోగానే ఎప్పటిప్పుడు బిల్లులను కేంద్రం రీయింబ‌ర్స్‌ చేసేట్లుగా కేంద్రాన్ని జగన్ ఒప్పించారు.

First Published:  6 Jun 2023 5:55 AM GMT
Next Story