Telugu Global
Andhra Pradesh

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీకి కేంద్రం షాక్‌

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఏపీ చీఫ్ సెక్రెటరీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీకి కేంద్రం షాక్‌
X

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం వెలువ‌రించింది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఏపీ చీఫ్ సెక్రెటరీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యే వరకు వచ్చే ఇంక్రిమెంట్లను రద్దు చేయాలని సిఫారసు చేశారు. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకునే విధంగా రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిప‌తిగా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాలు కొనుగోలు ఆరోప‌ణ‌ల‌తో వైసీపీ స‌ర్కారు స‌స్పెండ్ చేసింది. సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పెగాస‌స్ పై ప్రెస్ మీట్‌ పెట్ట‌డాన్ని జ‌గ‌న్ స‌ర్కారు సీరియ‌స్ గా తీసుకుని నోటీసు ఇచ్చింది. తాను ఎక్కడా ఆలిండియా సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించలేదని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని ఆ లేఖలో వివరించారు.

ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. రూల్ నంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటానని ఆయన ప్రశ్నించారు.

ఏపీలో జ‌గ‌న్ సీఎం అయ్యాక ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేదు. అప్ప‌టి నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. దీనిపై కోర్టులోనా, కేంద్రం వ‌ద్ద వివిధ ఫిర్యాదులున్నాయి.

First Published:  14 Feb 2023 12:16 PM GMT
Next Story