Telugu Global
Andhra Pradesh

సీఏఏపై చంద్రబాబు ఇలా స్పష్టంగా చెప్పగలరా..?

ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఏఏను సవరించాలని తాము పార్లమెంటులో చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. హిందువులకు, పార్శీలకు, జైనులకు, సిక్కులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు ఒకే విధమైన హక్కులు ఉండేలా సీఏఏను సవరించాలని తాము సూచించినట్లు తెలిపారు.

సీఏఏపై చంద్రబాబు ఇలా స్పష్టంగా చెప్పగలరా..?
X

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చెప్పినంత స్పష్టంగా చెప్పగలరా? బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆయన స్ప‌ష్లంగా చెప్పే స్థితిలో ఉండరనేది అందరికీ తెలిసిన విషయమే. సీఏఏను అంగీకరించేది లేదని వైసీపీ స్పష్టం చేసింది.

సంక్షేమ పథకాలు, శాంతిభద్ర‌త‌లు, న్యాయం వంటి విషయాల్లో మతం, కులం, పార్టీ, ప్రాంతాల ప్రాతిపదికపై వివక్ష ఉండకూడదని, ఈ విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గత ఐదేళ్లలో వందల సార్లు చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. అందువల్లకేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను తాము అంగీకరించలేమని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఏఏను సవరించాలని తాము పార్లమెంటులో చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. హిందువులకు, పార్శీలకు, జైనులకు, సిక్కులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు ఒకే విధమైన హక్కులు ఉండేలా సీఏఏను సవరించాలని తాము సూచించినట్లు తెలిపారు.

సీఏఏ తర్వాత ఎన్‌ఆర్సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఫర్‌ సిటిజన్స్‌), ఎన్పీఆర్‌ (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌) ముందుకు వస్తాయని, సీఏఏ వర్తించకపోతే, వారికి తగిన రక్షణ కల్పించకపోతే ఎన్‌ఆర్సీ లేదా ఎన్పీఆర్‌ల్లో భారత ముస్లింలు పౌరసత్వాన్ని నిరూపించుకోలేరని ఆయన అన్నారు.

ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌ల ద్వారా తమను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారని, ప్రస్తుత రూపంలోని సీఏఏ వారికి రక్షణ కల్పించలేదని ఆయన అన్నారు. సీఏఏపై పునరాలోచన చేయాలని, ప్రతి ఒక్కరినీ విశ్వసనీయతలోకి తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

First Published:  14 March 2024 6:47 AM GMT
Next Story